Chandrababu: 2019లో మనం గెలవాల్సిన అవసరం చాలా ఉంది: చంద్రబాబు

  • ప్రతిపక్షాల తప్పులను జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాం
  • అన్ని రకాల మీడియాలను వాడుకుంటూ ముందుకు వెళ్లండి
  • నా నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ రావచ్చు

ఇది ఎన్నికల సమయమని... పార్టీ నేతలు, కార్యకర్తలంతా జాగ్రత్తగా పని చేయాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు పనులను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలను ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు 22 వేల మంది ప్రజలు సందర్శించారని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్క ప్రాజెక్టు కోసం ఇంతగా కష్టపడుతుండటం... దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. మీ అందరికీ తన నుంచి ఎప్పుడైనా ఫోన్ రావచ్చని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొంచెం కఠినంగా ఉండక తప్పదని... తాను చెప్పేది వింటే వ్యక్తిగతంగా చెపుతానని... వినని వారికి ప్రజల్లోనే చెపుతానని హెచ్చరించారు.

ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందని, వాటిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, మౌత్ ప్రచారంతో ముందుకు సాగాలని చెప్పారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని, దానికోసం ఎంతైనా కష్టపడాలని అన్నారు. సోషల్ మీడియాలో ప్రతి నాయకుడు యాక్టివ్ గా ఉండాలని హితబోధ చేశారు. 

  • Loading...

More Telugu News