Chandrababu: నవనిర్మాణ దీక్షలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకొస్తున్నారు: బుగ్గన

  • టీడీపీ ప్రచారాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • కాంగ్రెస్ ను విమర్శిస్తూ, రాహుల్ తో ఎలా చేతులు కలిపారు
  • చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా అవినీతి జరిగింది

అర్థంపర్థంలేని కార్యక్రమాలను చేపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ డబ్బును టీడీపీ ప్రచారాలకు ఉపయోగిస్తున్నారని అన్నారు. పార్టీ సొమ్ముతో ఏమి చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని చెప్పారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని పదేపదే విమర్శించే చంద్రబాబు... బెంగళూరులో రాహుల్ గాంధీతో ఎలా చేతులు కలిపారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని.. చివరకు చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని బుగ్గన ఆరోపించారు. పులివెందులకు కూడా నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పడాన్ని బుగ్గన తప్పుబట్టారు. పులివెందుల ఏపీలో లేదా? అని ఆయన నిలదీశారు. నాలుగేళ్లపాటు కేంద్రం ముందు మోకరిల్లిన చంద్రబాబు... రాజకీయ విభేదాలతోనే ఎన్డీయేకు దూరమయ్యారని అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, స్థానిక సంస్థలు భ్రష్టు పట్టాయని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News