Andhra Pradesh: రైలు మీద సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. కృష్ణా జిల్లాలో విషాదం!

  • గూడ్స్ రైలుపై సెల్ఫీకి ప్రయత్నించిన విద్యార్థి
  • హైటెన్షన్ వైర్లు తాకి కుప్పకూలిన వైనం
  • మూడు ఆసుపత్రులకు తరలించినా దక్కని ప్రాణం

సెల్ఫీ సరదాకు మరొకరు బలైపోయారు. రైలు బండిపై సెల్ఫీ దిగి మిత్రులకు చూపించి సంబరపడాలన్న ఓ విద్యార్థి తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తొర్రకుంట పాలేనికి చెందిన పగడాల రామసాయి (15) పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 9.6 శాతం పాయింట్లు సాధించాడు. బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్‌కు వెళ్లిన రామసాయి స్నేహితులతో కలిసి ఆటలాడాడు.  ఇంటికెళ్లే ముందు గూడ్స్ రైలెక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లను గుర్తించకపోవడంతో అవి తాకి షాక్‌కు గురై రైలు మీదే కుప్పకూలాడు.

70 శాతం గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న రామసాయిని వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విద్యార్థి మృతి చెందాడు.

  • Loading...

More Telugu News