Kadiam Srihari: ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా?: కడియం శ్రీహరి

  • ఏనాడైనా కాంగ్రెస్ నేతలు రైతన్నను పట్టించుకున్నారా?
  • కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారు
  • వడ్లకొండ గ్రామంలో రైతుబంధు పథకం ప్రారంభంలో కడియం

దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామలో ఈ రోజు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... గతంలో జనగామ ఎమ్మెల్యేగా ఉండి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి పనిచేసిన కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఏనాడైనా ఇక్కడి చెరువులను నింపాలని ఆలోచించారా? రైతుకు పెట్టుబడి ఇవ్వాలనిగానీ, రైతుల రుణాలు మాఫీ చేయాలనిగానీ ఆలోచించారా? అని అడిగారు. కాంగ్రెస్ నేతలకు ఎన్నడూ ఈ ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

"నాలుగేళ్ల క్రితం వ్యవసాయం ఎంత సమస్యగా ఉంది? కరెంటు రాక, ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేక, సాగునీటి గురించి పట్టించుకోక రైతును తీవ్ర అవస్థల పాలు చేశారు. మేము అధికారం చేపడితే వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, రైతుకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేశాం" అని కడియం శ్రీహరి అన్నారు.

ఎరువులు, విత్తనాలకు ఇబ్బంది లేకుండా ముందే స్టాక్ చేసి పెడుతున్నారని, సాగునీరు అందించేందుకు చెరువుల్లో నీరు నింపుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. రైతు పెట్టుబడి కోసం ఎకరానికి 4000 రూపాయల చొప్పున ఏటా 8000 రూపాయలు అందిస్తోన్న ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కల్పించే రైతు బీమా పథకాన్ని ఈ ఏడాది జూన్ 2 నుంచి అమలు చేయనున్నామని చెప్పారు.

రైతును రాజు చేసే పథకాలు అమలు చేయడంతో పాటు పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం మొదట్లో 51 వేల రూపాయలు ఇచ్చారని, అవి సరిపోవని దానిని 75 వేల రూపాయలు చేశారని, ఇంకా సరిపోవడం లేదని సీఎం స్వయంగా గుర్తించి దానిని ఇప్పుడు 1,00,116 రూపాయలకు పెంచారన్నారు. అదేవిధంగా 16 వస్తువులతో కేసీఆర్ కిట్ ఇస్తున్నారని, గర్భిణీ స్త్రీలకు ప్రసవం ముందు, తరువాత ఆరు నెలల పాటు నెలకు 2000 చొప్పున 12000 రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు కలిపి 13000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు.

ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని కడియం ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం నిత్యం ఆలోచిస్తోన్న కేసీఆర్‌ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం రైతులకు పాస్ బుక్కులు, చెక్కులు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మండలి విఫ్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు

  • Loading...

More Telugu News