Pawan Kalyan: పవన్ కల్యాణ్ కర్ణాటక వెళ్లడం లేదు: జనసేన

  • ఎవరి తరఫునా ప్రచారం చేయబోరు
  • స్పష్టం చేసిన జనసేన ప్రతినిధి
  • మరోవైపు నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచన
  • మౌనంగా ఉండిపోయిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న ఆలోచనలో లేరని జనసేన స్పష్టం చేసింది. ఏపీలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టమే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి వున్నందునే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి పవన్ కర్ణాటక పర్యటనపై ఆది నుంచి అనుమానాలే ఉన్నాయి.

ఏ పార్టీ తరఫున ప్రచారం చేసినా, మరోవైపు నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతోనే జనసేనాని మొదటి నుంచి ఉన్నారని సమాచారం. అందువల్లే తమ తరఫున ప్రచారం చేయాలని జేడీ-యస్ నేత కుమారస్వామి స్వయంగా కోరినా, పవన్ హామీ ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఓట్లు వేయరాదని పవన్ కన్నడనాట ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు డిమాండ్ చేసినా, పవన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. కాగా, హోదా సాధన, విభజన హామీల అమలే లక్ష్యంగా ఈ నెల 11న తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News