Telangana: 'మీరే చస్తారా?.. నేను చంపాలా?' అంటూ బెదిరింపులు.. భయపడి పురుగుల మందు తాగిన జంట!

  • వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన జంట
  • జంటపై పలుమార్లు దాడికి పాల్పడ్డ పండ్ల రాము
  • సుఖంగా బతకనివ్వడని భావించి ఆత్మహత్య

'చస్తారా? లేక చంపమంటారా?' అంటూ పెడుతున్న వేధింపులు భరించలేక సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం కొంపల్లికి చెందిన జంగా హరినాథ్‌ (48) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని మొదటి భార్య మృతి చెందిన నేపథ్యంలో గత మూడేళ్లుగా మల్హర్‌ మండలం కొయ్యూర్‌ కు చెందిన శ్యామలతో సహజీవనం చేస్తున్నాడు. దానిని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ప్రధానంగా శ్యామల చిన్నతమ్ముడు పండ్ల రాము పలుమార్లు వారిపై దాడికి పాల్పడ్డాడు.

కలిసి ఉండొద్దంటూ హెచ్చరికలు చేశాడు. కొట్టి దూరం చేశాడు. అయినప్పటికీ వారు విడిపోకపోవడంతో మీరు చస్తారా? లేక నన్నే చంపమంటారా? అంటూ హెచ్చరించాడు. దీంతో అతను సుఖంగా బతకనివ్వడని భావించి, ఉదయం 7.30 ప్రాంతంలో కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్‌ వద్ద ఈ జంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హరినాథ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

వారిని గమనించిన స్థానికులు 108లో మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను వరంగల్ లోని ఎంజీఎంకు తరలిచారు. ‘మిమ్మల్ని చంపాలా? లేక మీరే చస్తారా?’ అని రాజు బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్‌ రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరినాథ్ కుమారుడు ప్రసన్న కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News