KCR: దళితులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

  • భారత్ బంద్ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో దళితులపై దాడి
  • దళితులకు ప్రభుత్వం, సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాలి
  • ప్రధానమంత్రి వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై చర్చించాలి

భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం, సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని, అణచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని సీఎం తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని ఈ సందర్బంగా కేసీఆర్ గుర్తు చేశారు.

దళితులకు కల్పించిన హక్కులు, తీసుకువచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా, తమ రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.

 దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ సూచించారు.

  • Loading...

More Telugu News