Hyderabad: బెడ్ రూంలో రేగిన మంటలకు మాజీ సైనికాధికారి ఆహుతి!

  • భార్యతో కలిసి ఫ్లాట్ లో ఉంటున్న మాజీ సైనికాధికారి
  • మల్లికార్జున్ రావుకి సిగిరెట్ తాగే అలవాటు
  • సిగిరెట్ పీకల కారణంగా మంటలు వ్యాపించి, సజీవదహనం

సొంతింటి బెడ్ రూంలో మాజీ సైనికాధికారి సజీవ దహనమైన ఘటన హైదరాబాదులో కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌ విజయశ్రీ అపార్ట్‌మెంట్‌ లో మాజీ సైనికాధికారి శంకర్‌ శ్రీశైలం మల్లికార్జున్‌ రావు(75), భార్య శంకర్‌ రోహిణితో కలిసి నివాసముంటున్నారు. వీరి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.

నిన్న సాయంత్రం మల్లికార్జున్‌ రావు బెడ్‌ రూం నుంచి పొగలు రావడం చూసిన భార్య, ఇరుగు పొరుగులను పిలిచింది. వారొచ్చి డోర్ కొట్టినా తీయకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లగా, బెడ్‌ రూం మొత్తం కాలి బూడిదవ్వగా, మల్లికార్జున్‌ రావు సజీవ దహనమై కనిపించాడు. దీంతో ఆమె బోరున విలపించింది. మల్లికార్జున్ రావుకు సిగరెట్‌ అలవాటుందని, సిగరెట్ పీకల కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని, కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News