dana: తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా

  • 2,53,785 మందికి 53,00,000 పైచిలుకు గొర్రెల పంపిణీ 
  • గొర్రెలకు బీమా సౌకర్యం కూడా
  • గొర్రెల తాగు నీటికి 17 వేల నీటి తొట్టెలు 
  • మామిడి పల్లిలో గొర్రెల పెంపకంపై శిక్షణా కేెంద్రం

వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థ‌క శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ లోని తెలంగాణ‌ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటివరకు 2,53,785 మందికి, 53,00000 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు.

కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తలసాని చెప్పారు. యూనిట్ కు 4 బస్తాల దాణాను అందిస్తామని, గొర్రెలకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, చనిపోయిన వాటి వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే గొర్రెల పెంపకం దారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రాబోయే రోజులలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుతుందన్నారు.

రంగారెడ్డి జిల్లా మామిడి పల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణా కేెంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితిపై రైతులకు ఇస్తున్నామన్నారు. పశువుల ఆరోగ్యానికి సంబంధించి 1962 కాల్ సెంటర్ ద్వారా వెటర్నరీ సేవలందిస్తున్నామని, మొత్తం100 సంచార పశు వైద్యశాలలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన గొర్రెల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో గొల్లకురుమలు సంతోషంగా ఉన్నారని అన్నారు.  రాష్ట్రంలోని సంచార పశు వైద్యశాలలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తలసాని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు సమష్టి కృషితో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. అనంతరం తెలంగాణ పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని గొర్రెల తాగు నీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 3 వేల నీటి తొట్టెలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గొర్రెల కోసం 90 శాతం సబ్సిడీపై షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

  • Loading...

More Telugu News