love: పబ్లిక్ పార్కులో ప్రేయసితో ఎలుకల మందు తినిపించిన ప్రియుడు

  • ఐదేళ్లుగా యువతితో ప్రేమలో కిషన్ సోనవానే
  • విఖ్రోలీ గార్డెన్ కు పిలిచి, కత్తితో బెదిరించి ఎలుకల మందు తినిపించిన కిషన్
  • యువతిని ఆసుపత్రికి తరలించిన సందర్శకులు

బ్రేకప్ చెప్పిన ప్రియురాలిని పబ్లిక్ పార్కులో కత్తితో బెదిరించి, ఎలుకల మందు తినిపించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని కంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అదే ప్రాంతానికి చెందిన యువతి (22)తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వారిద్దరూ గత నెల బ్రేకప్ చెప్పుకున్నారు.

అయితే, ప్రియురాలు దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన కిషన్ మాట్లాడాలని ఉందని, విఖ్రోలీలోని గార్డెన్ కు రావాలని ఆమెను కోరాడు. మాజీ ప్రియుడి కోరిక మన్నించిన యువతి పార్క్ కు వచ్చింది. అక్కడ ఆమెను కత్తితో బెదిరించి, ఎలుకలమందు బిళ్ల తినిపించాడు. గత్యంతరం లేని యువతి దానిని తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పార్కులోని సందర్శకులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. యువతి వాంగ్మూలంతో పరారీలో ఉన్న కిషన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News