budget: 28 వరకు శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్‌: వివరాలు తెలిపిన పల్లె రఘునాథరెడ్డి

  • సమావేశాలకు మధ్యలో 5 రోజుల సెలవులు 
  • గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చకు 7న చంద్రబాబు సమాధానం 
  • గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించారు
  • 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ

ఈ రోజు ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... సమావేశాలకు మధ్యలో 5 రోజులు సెలవులు ఉంటాయని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చకు 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారన్నారు.

8వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడతారని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించినట్లు తెలిపారు. 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వివరించారు. ఈ విధంగా రద్దు చేయడం దేశంలోనే ఓ అపూర్వ ఘట్టం అన్నారు. దీంతో రైతుల తలరాతలు మారిపోయాయన్నారు. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా కంటున్న కల నదుల అనుసంధానం అని, తాము పట్టిసీమ ద్వారా గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన పనుల ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ-ఆఫీస్, ఈ-ఫైల్స్ వంటి వాటి ద్వారా సాంకేతిక రంగంలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. వ్యాపార అనుకూలతతో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. రూ.13.54 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక రంగం పురోభివృద్ధి సాధించనుందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా రూ.149 లకే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు రేషన్ అందజేస్తున్నట్లు పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. 50 లక్షల మందికి పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 12 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించడానికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల్లో చంద్రన్న బీమా ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడి సామర్థ్యం వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్నికల హామీలన్నిటిని నెరవేర్చినట్లు పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. 

  • Loading...

More Telugu News