Prakash Raj: మైసూరు ఎంపీపై ఒక్క రూపాయికి పరువునష్టం దావా వేసిన ప్రకాశ్ రాజ్!

  • ప్రకాశ్ రాజుపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతాప్ సింహా
  • పరువుకు భంగం వాటిల్లిందంటూ మైసూరు సిటీ కోర్టులో దావా
  • మార్చి 3వ తేదీకి వాయిదా పడ్డ కేసు

మైసూరు బీజేపీ ఎంపీ (లోక్ సభ) ప్రతాప్ సింహా తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆయనపై మైసూరు సిటీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేసిన ప్రతాప్ సింహాపై ఒకే ఒక్క రూపాయికి పరువు నష్టం దావా వేసినట్టు మీడియాకు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

అయితే, ఒక్క రూపాయికే పరువు నష్టం దావా ఎందుకు వేశారనే విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కేవలం డబ్బు కోసం ఆయనపై దావా వేయలేదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే వాళ్లకు గుణపాఠం చెప్పేందుకే ఈ దావా వేసినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ కేసు మార్చి 3వ తేదీకి వాయిదా వేసినట్టు ప్రకాశ్ రాజ్ తరపు న్యాయవాది మహదేవస్వామి పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై  ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రకాశ్ రాజ్ కోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News