Chandrababu: సీఎం చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లాలి?: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అసంతృప్తి

  • రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి
  • మేము మిత్రపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల కోసమే పోరాడుతున్నాం
  • కుట్రలు చేస్తోంది వైసీపీ..పోరాటాలు చేస్తోంది టీడీపీ 

ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో చంద్రబాబునాయుడు ఈరోజు నిర్వహించిన సమావేశంలో చర్చిస్తున్నారు. నాలుగేళ్లు దాటుతున్నప్పటికీ విభజన చట్టంలోని అంశాలపై స్పష్టత లేదని, రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, హేతుబద్ధత లేకుండా విభజించారని, విభజన తర్వాత కోలుకోవాలనే ఉద్దేశంతోనే విభజన చట్టం తీసుకొచ్చారని అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. తాము మిత్రపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల కోసమే పార్లమెంటులో పోరాడామని, ఇప్పటికీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.35 వేల తక్కువలో ఉన్నామని అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్బంగా కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు దూరదర్శన్, పాస్ పోర్టు ఆఫీసులు ఇవ్వరా? మేమేమైనా పక్క దేశంలో ఉన్నామా? రైల్వేజోన్ విషయంలో సమాధానం ఇవ్వలేదు! రాజకీయ నిర్ణయం తీసుకుంటే రైల్వేజోన్ పై క్లారిటీ వస్తుంది. కంభంపాటి విడుదల చేసిన నివేదికలో విభజన హామీల ప్రస్తావనే లేదు. కుట్రలు చేస్తోంది వైసీపీ.. పోరాటాలు చేస్తోంది టీడీపీ. వైసీపీవి నిలకడలేని ప్రకటనలు, నిబద్ధత లేని పోరాటాలు. వైపీపీ నేతల రాజీనామాల సంగతి ఏమైంది? వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు!’ అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

  • Loading...

More Telugu News