Wife: భర్తను చంపేందుకు బీహార్ నుంచి ప్రియుడిని విమానంలో పిలిపించిన భార్య!

  • మాయమైపోతున్న మానవ సంబంధాలు
  • ఎనిమిదేళ్ల చిన్నవాడైన మరిదితో సంబంధం
  • భర్తను హత్య చేయించిన భార్య
  • సికింద్రాబాద్ లో అరెస్ట్

మానవ సంబంధాలు మాయమైపోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్న భర్తను అంతమొందిస్తున్న భార్యల జాబితాలోకి మాలతీదేవి కూడా చేరిపోయింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, జై మంగళ్ దాస్, ఆయన భార్య మాలతీదేవి ఎనిమిదేళ్ల క్రితం బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చి, ఫతేనగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఏడాదికోమారు వీరు స్వగ్రామానికి వెళ్లి వస్తుంటారు. తాజాగా బీహర్ వెళ్లినప్పుడు తనకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడైన చెల్లెలి మరిది నీరజ్ కుమార్ తో మాలతీదేవికి పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న మంగళ్ దాస్ ఆమెను మందలించాడు కూడా.

ఇక నీరజ్ లేకుండా ఉండలేనని భావించిన ఆమె, ప్రియుడితో కలసి హత్యకు ప్రణాళిక రచించింది. బీహార్ లో ఉన్న నీరజ్ కుమార్ ను గత నెల 31న హైదరాబాద్ కు పిలిపించింది. స్పైస్ జెట్ విమానంలో వచ్చిన నీరజ్, రాత్రి 12 గంటలకు మాలతి ఇంటికి వెళ్లి, అప్పటికే మందు కొట్టి పడుకుని గాఢ నిద్రలో ఉన్న మంగళ్ దాస్ గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ లేఖ రాసి అక్కడే పెట్టి, తిరిగి విమానంలో బీహార్ వెళ్లిపోయాడు. ఆపై మాలతి ఇద్దరు బిడ్డలను తీసుకుని పారిపోయింది. ఇంట్లోనే ఉన్న కొడుకు పొద్దున్నే తండ్రిని నిద్రలేపేందుకు ప్రయత్నించడంతో విషయం బయటపడింది.

ఘటనా స్థలికి వచ్చిన పోలీసులకు సూసైడ్ నోట్ కనిపించడంతో తొలుత ఆత్మహత్యగానే భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో గొంతుకు తాడు బిగించి చంపినట్టు తేలడంతో హత్య కేసు నమోదు చేశారు. ఆయన భార్య మాలతీదేవిని సికింద్రాబాద్ సమీపంలో అరెస్ట్ చేసి విచారించడంతో విషయం బట్టబయలైంది. ఆమె ప్రియుడు నీరజ్ ను అరెస్ట్ చేసేందుకు బీహార్ కు ప్రత్యేక బృందాన్ని పంపినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News