KTR: పురపాలికలుగా మార్చాక కనీసం రెండేళ్ల పాటు పన్నుల పెంపు ఉండబోదు: మంత్రి కేటీఆర్

  • ఔటర్ రింగ్ రోడ్డు లోపల నూతన పురపాలక సంస్థల ఏర్పాటుపైన మంత్రి కేటీఆర్ భేటీ
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు
  • 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలను పరిశీలించాలి
  • కచ్చితంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా వాటిని మార్చాలి

ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలక సంస్థలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఏమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలను కచ్చితంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వాటిని ఏర్పాటు చేయడం కోసం పరిసర ప్రాంతాలను కలపాల్సి ఉందని అన్నారు. నూతన పురపాలక సంస్థల ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. పురపాలక సంస్థలను ఏర్పాటు చేసిన తర్వాత కనీసం రెండు సంవత్సరాల పాటు పన్నుల పెంపు ఉండబోదన్నారు. దీంతోపాటు నూతన పురపాలక సంస్థలకు నిధులను సైతం అందిస్తామన్నారు.

నూతనంగా పురపాలక సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ద్వారా రాబోయే జనాభాను సైతం ఈ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు లోపల 167 గ్రామాలున్నాయని, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి నూతన పురపాలక సంస్థలుగా ఏర్పాటు చేయడం, ఇతర పురపాలక సంస్థల్లో విలీనం చేయడం వంటి ప్రక్రియలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

అధికారుల నివేదికలతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి నూతన పురపాలక ప్రాంతాలకు ప్రతిపాదనలివ్వాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అమీన్ పూర్, బొల్లారం, కొంపల్లి,  పుప్పాల గూడ, ప్రగతి నగర్, తెల్లాపూర్, కొల్లూర్, తుర్క యాంజల్ లతో పాటు మరికొన్ని మున్సిపాలీటీలను ఏర్పాటు చేయడంపైన ఈ సమావేశంలో చర్చించారు. 

  • Loading...

More Telugu News