Balakrishna: వైభ‌వోపేతంగా లేపాక్షి వేడుక‌లు జరపాలని ఆదేశించిన బాల‌కృష్ణ‌.. మహేశ్ బాబు, తమన్నా వచ్చే అవకాశం

  • ఉత్స‌వ కార్యాచ‌ర‌ణ‌పై ప‌ర్యాట‌క అధికారుల‌తో బాలకృష్ణ స‌మీక్ష‌
  • తొలి కార్య‌క్ర‌మంగా సీఎంతో జ‌ల‌హార‌తి
  • ముగింపు వేడుక‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌
  • ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా హేమ‌మాలిని, శివ‌మ‌ణి కూడా

గ‌త సంవ‌త్స‌రం నిర్వ‌హించిన లేపాక్షి ఉత్స‌వాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సంవ‌త్స‌రం వేడుక‌లు నిర్వ‌హించాల‌ని హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ అన్నారు. నాటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు పున‌రావృతం కారాద‌ని, కొత్త‌ద‌నం క‌నిపించాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించే విధంగా లేపాక్షి ఉత్స‌వాల‌ను వైభ‌వోపేతంగా నిర్వ‌హించాల‌న్నారు. లేపాక్షి ఉత్సవాల కార్యాచర‌ణ, ప్ర‌ణాళిక‌పై ఈ రోజు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌శాఖ అధికారులు, అనంత‌పురం జిల్లా యంత్రాంగం, ప్ర‌జా ప్ర‌తినిధులతో చర్చించిన బాలకృష్ణ ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, సంప్ర‌దాయ విలువ‌లు పాటిస్తూనే లేపాక్షి ఉత్స‌వాల‌ను వైవిధ్యభ‌రితంగా, వినూత్నంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌న్నారు. రెండు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నుండ‌గా, తొలిరోజు హేమ‌మాలిని, మ‌లిరోజు శివ‌మ‌ణి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉండేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నామ‌న్నారు. సినీతార‌లు సంద‌డి చేసేలా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు, త‌మ‌న్నా వంటి తార‌ల‌ను సంప్ర‌దించామ‌ని, వారి నుంచి స్పందన రావాల్సి ఉందని అన్నారు.

మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఐదు జోన్లుగా విభ‌జించామ‌ని ప్ర‌ధాన వేదిక‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, స‌న్మానాల వంటివి ఒక జోన్‌లో ఉంటాయని, వివిధ ప్ర‌ద‌ర్శ‌న‌లు, కొనుగోళ్లు, అమ్మ‌కాలు, ఆహార పండుగ‌లు బ‌జార్ జోన్‌లో ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌త్యేకంగా చిన్నారులు, మ‌హిళ‌లను ఉల్లాస‌ప‌రిచేలా చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు మరో జోన్‌లో ఉంటాయ‌ని, కబ‌డ్డి, క‌ర్ర‌సాము, క‌త్తిసాము వంటి సంప్ర‌దాయ క్రీడా పోటీలు ప్ర‌త్యేక జోన్‌గా నిర్వ‌హిస్తామన్నారు. వార‌స‌త్వ జోన్‌లో దేవాల‌యాలకు సంబంధించిన అంశాలు ఉంటాయ‌ని మీనా స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ కోసం ఇప్ప‌టికే రూ.2 1కోట్లు మంజూరు చేశామ‌ని, నిధుల స‌మ‌స్య లేకుండా వేడుక‌ల‌ను దిగ్విజ‌యం చేయాల‌న్న‌దే ప‌ర్యాట‌క శాఖ ఉద్దేశమన్నారు.
 
ఏపీటీడీసీ ఎండీ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ.. తొలి రోజు ముఖ్యఅతిథిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ఆహ్వానిస్తుండ‌గా, రెండో రోజు కార్య‌క్ర‌మాల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఇదే స‌మావేశంలో పాల్గొన్న జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ తొలుత జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం చేప‌డ‌దామ‌ని, త‌రువాత వేడుక‌ల‌ను ప్రారంభిద్దామ‌ని నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సూచించ‌గా, ఆయ‌న సానుకూలంగా స్పందించారు.

ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ మాట్లాడుతూ లేపాక్షిలో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా క‌నీసం 20 గ‌దుల‌కు త‌క్కువ కాకుండా వ‌స‌తిగృహాన్ని నిర్మించ‌వ‌ల‌సి ఉంద‌ని, 2017-2018 బ‌డ్జెట్‌లో అందుకు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తామ‌న్నారు. అయితే, ఈ కార్య‌క్ర‌మాన్ని గ‌తంలో ఫిబ్ర‌వ‌రి 24, 25 తేదీల‌లో నిర్వ‌హించాల‌ని భావించిన‌ప్ప‌టికీ, ఉత్స‌వాల తేదీల‌ను మార్చి 9, 10 తేదీల‌కు మార్చారు.

ఇక స్వ‌యంగా సినీ నటుడు అయిన బాల‌కృష్ణ.. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ప‌రంగా ప్ర‌త్యేక‌త‌ను చూపాల‌న్న ఆకాంక్ష‌లో ఉన్నారు. రెండు రోజుల పాటు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు సంద‌డి ఉండాల‌ని, ఎవ్వ‌రికీ ఇబ్బంది రాని రీతిలో ఏర్పాట్లు ఉండాల‌న్నారు. ఈ స‌మావేశంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ఆర్‌డీ జి.గోపాల్‌, ఈఈ ఈశ్వ‌ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News