ntr: సరిగ్గా ఇదే రోజున నాడు ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు: కుప్పం ‘జన్మభూమి’లో చంద్రబాబు

  • కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా
  • మీ ఆశీస్సులే నన్ను ఇంతటి వాడిని చేశాయి
  • కుప్పం సమావేశం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలి: చంద్రబాబు

సరిగ్గా ఇదే రోజున నాడు ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని, ముప్పై ఐదేళ్ల తర్వాత అదే రోజున ఆయన స్థాపించిన పార్టీయే అధికారంలో ఉండటం, టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి’ జరుపుకోవడం ఒక చరిత్ర అని చెబుతూ సీఎం చంద్రబాబునాయుడు ఉద్వేగం చెందారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని ననియాల ఫారెస్ట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్ద ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 9-1-1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ముప్పై ఏళ్లుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, తనకు అద్భుత స్వాగతం పలికిన వారిని ఎన్నటికీ మరువలేనని అన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

ప్రజలు కూడా వారి కుటుంబ ఆదాయ వనరులు పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కుప్పం ప్రజల ఆశీస్సులే తనను ఇంతటి వాడిని చేశాయని, కుప్పం సమావేశం రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

  • Loading...

More Telugu News