Jayalalitha: ఎంబ్లామింగ్‌లో భాగంగానే జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు.. డాక్టర్ సుధా శేషయ్యన్ వాంగ్మూలం!

  • జయలలిత మృతిపై ఊపందుకున్న విచారణ
  • విచారణ కమిటీ ఎదుట హాజరైన డాక్టర్ సుధా శేషయ్యన్
  • మృతదేహం పాడవకుండా ఉండేందుకు రసాయనాలు ఎక్కించామన్న సుధ


ఎంబ్లామింగ్‌లో భాగంగానే జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ విచారణ కమిటీకి తెలిపారు. జయలలిత మృతిపై ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిటీ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పారు. జయకు అత్యంత సన్నిహితురాలైన ఆమెకు జయ మరణించిన రోజు రాత్రి పది గంటలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది.

ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారని ఆమె పేర్కొన్నారు. తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు వివరించారు. మెథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు.

తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి  అర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కమిటీ విచారణను వేగవంతం చేసింది.

  • Loading...

More Telugu News