KTR: కంపెనీల విజ్ఞప్తి మేరకు వాటి వివరాలను ఇప్పుడే పూర్తిగా చెప్పడం లేదు: మంత్రి కేటీఆర్

  • బుద్వేల్ లో ఐటీ క్లస్టర్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం
  • క్లస్టర్ ఏర్పాటు చేయనున్న స్థలాల పరిశీలన
  • ప్రభుత్వంతో చర్చిస్తోన్న 30కి పైగా కంపెనీలు
  • కంపెనీల స్థాపన పూర్తయితే సూమారు లక్షా 25 వేల ఉగ్యోగాల కల్పన

హైదరాబాద్‌లో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలో ఏర్పాటు కానున్న బుద్వేల్, రాజేంద్రనగర్ ఐటీ క్లస్టర్ ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. క్లస్టర్ ఏర్పాటు కోసం సేకరించనున్న పలు స్థలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. బుద్వేల్ ఐటి క్లస్టర్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఈ క్లస్టర్ లో కంపెనీలను స్థాపించేందుకు ఇప్పటికే 30కి పైగా సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని తెలిపారు.

ఇందులో ఐటీ పరిశ్రమలో పేరున్న దేశీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ స్థాయి మల్టీ నేషనల్ కంపెనీలున్నాయన్నారు. కంపెనీల విజ్ఞప్తి మేరకు వాటి వివరాలను ఇప్పుడే పూర్తిగా చెప్పడం లేదన్నారు. త్వరలోనే ఆయా కంపెనీలు లాంఛనంగా పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను నగరంలోని నలు మూలలకు విస్తరించాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోతుందన్నారు. కొత్త క్లస్టర్ ద్వారా ఐటీ పరిశ్రమ మరింత విస్తరిస్తుందన్నారు.

నూతనంగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్‌లో అన్ని మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ ఐఐసి అధికారులకు అదేశాలు జారీ చేశామని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబందించి అత్యుత్తమ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాక సూమారు లక్షా పాతిక వేల ఉద్యోగాలు నూతనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. రాబోయే 5 ఏళ్లలోపే ఈ కంపెనీలు తమ పూర్తి  స్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తాయన్నారు.

ప్రస్తుతం రాజేంద్రనగర్‌లో ఉన్న పలు కార్యకలాపాలు లేని పలు ప్రభుత్వ సంస్థలు తమ భూములను పరిశ్రమలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, వాటి భూ యాజమాన్య మార్పులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్లస్టర్ పనులను వేగవంతం చేసేందుకు ఐటీ శాఖ, రెవెన్యూ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీఎస్ ఐఐసి లతో కలిపి ఒక సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించనున్నారని మంత్రి తెలిపారు.      

  • Loading...

More Telugu News