India: లంకను కుమ్మేసిన బౌలర్లు.. టీ20లో భారత్‌కు అతిపెద్ద గెలుపు!

  • టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలిన లంక
  • 93 పరుగుల తేడాతో అతిపెద్ద విజయం
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం

టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై బంతులతో దాడి చేశారు. వారి బ్యాటింగ్‌ను శాసించారు. ఫలితంగా కటక్‌లో బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం  సంపాదించింది. భారత్ నిర్దేశించిన 181 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.

చాహల్, హార్ధిక్ పాండ్యాల బౌలింగ్  దెబ్బకు శ్రీలంక టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. శ్రీలంక బ్యాట్స్‌మన్‌లలో ఉపుల్ తరంగ చేసిన 23 పరుగులే అత్యధికం. కుశాల్ పెరీరా 19, డిక్‌వెల్లా 13, చమీర 12 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4, హార్ధిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 2, జయ్‌‌దేవ్ ఉనద్కత్ 1 వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 17, లోకేశ్ రాహుల్ 61, శ్రేయాస్ అయ్యర్ 24, ధోనీ 39, మనీష్ పాండే 32 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, పెరీరా, ప్రదీప్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టీ20లలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. రెండో వన్డే ఈనెల 22న ఇండోర్‌లో జరగనుంది. నాలుగు వికెట్లు తీసిన చాహల్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.  

  • Loading...

More Telugu News