Virat Kohli: ఢిల్లీ నుంచి విరాట్.. ముంబై నుంచి అనుష్క స్విట్జర్లాండ్‌కు పయనం.. ఊపందుకున్న పెళ్లి వార్తలు!

  • స్విట్జర్లాండ్‌కు బయలుదేరిన కోహ్లీ, అనుష్క
  • అటునుంచి అటే మిలాన్‌కు..
  • ఊపందుకున్న పెళ్లి ఊహాగానాలు
  • ముంబైలో భారీ విందు

లేదు, లేదంటూనే విరాట్ కోహ్లీ, అనుష్కలు మనువాడబోతున్నారా? ఎవరికీ చెప్పకుండా ఒక్కటి  కాబోతున్నారా? గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 12న ‘విరుష్క’ వివాహం ఖాయమని వారి చర్యలను బట్టి నిర్ధారించుకోవాల్సి వస్తోంది. పెళ్లిపై వస్తున్న వార్తలను అనుష్క మేనేజర్ ఖండించినా, కోహ్లీ నుంచి సమాధానం రాకున్నా.. పెళ్లి మాత్రం పక్కా అని చెబుతున్నారు. దీనికి బోలెడన్ని ఉదాహరణలు చెప్పుకొస్తున్నారు.

కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ డీడీసీఏను సెలవు కోరారు. కీలకమైన మ్యాచ్ ఉన్నప్పటికీ ఆయన సెలవు కోరడం వెనక బలమైన కారణమే ఉందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆయన సెలవు తీసుకున్న రోజే కోహ్లీ, స్నేహబృందం మిలాన్ వెళ్లనుండడంతో పెళ్లి వార్తలకు ఊపు వచ్చింది. అంతలోనే అనుష్క తన తల్లి, తండ్రి, సోదరుడితో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో వివాహ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక గురువారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కోహ్లీ శుక్రవారం తెల్లవారుజామున 2:45 గంటలకు స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈ సమయంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి కర్చిఫ్ కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

స్విట్జర్లాండ్‌లో కోహ్లీ, అనుష్కలు కలుసుకుని అక్కడి నుంచి ఇటలీలోని మిలాన్ చేరుకుంటారని, 12న అక్కడే పెళ్లాడతారని తెలుస్తోంది. పెళ్లి పూర్తయ్యాక మాత్రమే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. పెళ్లి గురించి టీమిండియా సహచరులకు కూడా ఆహ్వానం అందించని కోహ్లీ, జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు ముంబైలో విందు ఇవ్వనున్నాడని చెబుతున్నారు.

మిలాన్‌లో తప్పకుండా ఏదో ప్రోగ్రాం ఉండే ఉందని, అది పెళ్లి అయినా కావచ్చు, లేదంటే నిశ్చితార్థమైనా కావచ్చని మరికొందరు అంటున్నారు. అదేమిటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగక తప్పదు!

  • Loading...

More Telugu News