Hyderabad: మెట్రోకు ముహూర్తం కుదిరింది.. 28న మధ్యాహ్నం రెండు గంటలకు కూత!

  • మియాపూర్‌లో జెండా ఊపి ప్రారంభించనున్న మోదీ
  • అదే రైలులో అమీర్‌పేట వరకు ప్రయాణం
  • 28 నుంచే ప్రజలకు కూడా అందుబాటులోకి

మొత్తానికి ముహూర్తం కుదిరింది. అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది. హైదరాబాదు మెట్రో కూతకు శుభముహూర్తం ఓకే అయింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు మియాపూర్‌ నుంచి ప్రారంభించేందుకు రంగం  సిద్దమైంది. ప్రధాని నరేంద్రమోదీ 28న విమానంలో బేగంపేట చేరుకుని అక్కడి నుంచి మియాపూర్ వెళ్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు మెట్రో స్టేషన్‌తోపాటు అక్కడే ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మెట్రో రైలుకు పచ్చజెండా ఊపి అదే రైలులో అమీర్‌పేట వరకు ప్రయాణిస్తారు. అమీర్‌పేట చేరుకున్నాక అక్కడి ఇంటర్ చేంజ్ స్టేషన్‌ను మోదీ పరిశీలిస్తారు. తిరిగి అదే మార్గంలో మియాపూర్ చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు.

మియాపూర్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించిన అనంతరం మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు మోదీ హాజరవుతారు. ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, మెట్రోను మోదీ ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

  • Loading...

More Telugu News