accident: తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదం... ఐఏఎస్ అవ్వాల‌నుకున్న యువతి మృతి


ఐఏఎస్ కావాల‌నుకుని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న ఓ యువ‌తి తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే, ఎంబీఏ పూర్తిచేసిన దంగేటి గౌతమి ఐఏఎస్ అవ్వాలన్న లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల కోసం ఇటీవ‌లే త‌న‌ ఇంటికి వచ్చింది. ఆమె త‌న చెల్లి దంగేటి పావనితో క‌లిసి హోండా యాక్టివా స్కూటర్‌పై పాలకొల్లు నుంచి నరసాపురం వెళుతున్న స‌మ‌యంలో ఓ సఫారీ కారు ఢీ కొంది. అనంత‌రం ఆ కారు గౌతమిని దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి, నరసాపురం పెదకాలువలోకి వెళ్లిపోయింది. ఈ ఘ‌‌టనలో అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు వారిని నరసాపురంలోని ఓ ప్రైయివేటు ఆసుప‌త్రికి తరలించారు.

అయితే, ఈ ప్ర‌మాదంలో రెండు కాళ్లు విరిగిపోయిన‌ గౌతమి, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోద‌రి పావని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. వీరి తండ్రి గ‌త ఏడాదే మ‌ర‌ణించాడు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారులో యువకులు మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెప్పారు. ప్రమాదం జ‌ర‌గ‌గానే ఆ యువ‌కులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.  

  • Loading...

More Telugu News