pawan kalyan: తొలిసారిగా సినిమాకు సంబంధించిన ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ద్వారా భారతీయ జనతా పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోన్న పవన్ కల్యాణ్ తాజాగా అదే సామాజిక మాధ్యమ వేదికగా ఓ సినిమాపై స్పందించారు. తొలిసారిగా సినిమాకు సంబంధించిన ట్వీట్ చేసిన పవన్.. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్పై ప్రశంసలు కురిపించారు. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ లో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ సినిమా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను పవన్ కల్యాణ్ కొనియాడారు. ఇటీవల తాను దంగల్ సినిమా చూశానని, తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా ఉండలేకపోతున్నానని పవన్ పేర్కొన్నారు.
ఆమిర్ ఖాన్ అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, అంత గొప్ప నటుడు భారతీయుడు కావటం మనకు గర్వకారణమని పవన్ పేర్కొన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు తన అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ సినిమా దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా కథను ఎంతో చక్కగా ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా తీశారని ఆయన అన్నారు. ఈ సినిమాలో బబితా ఫొగట్గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలకు, గీతా ఫొగట్ పాత్రలో నటించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్ లకు తన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ చిత్రం స్త్రీ సాధికారత గురించి మనందరినీ మరోసారి ఆలోచించేలా చేసిందని పవన్ పేర్కొన్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) January 1, 2017