వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. దీంతో నెట్ వాడే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఇవన్నీ కలసి డిజిటల్ చెల్లింపులను పెంచుతున్నాయి. పేటీఎం తరహా వ్యాలెట్లు, ఓలా మనీ, మొబిక్విక్, సొడెక్సో, సిట్రస్ వ్యాలెట్ తదితర డిజిటల్ పేమెంట్ వ్యాలెట్లు చాలానే ఉన్నాయి. వీటిని వినియోగించే వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా పూర్తి కేవైసీ వివరాలతో తమ వ్యాలెట్లను అప్ డేట్ చేసుకోకపోతే ఈ నెల 28 తర్వాత కొన్ని రకాల ప్రయోజనాల్ని కోల్పోవాల్సి వస్తుంది.
వీటన్నింటినీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇనుస్ట్రుమెంట్స్ (పీపీఐ) గా పిలుస్తారు. ఎక్కడైనా ఓ వేదిక దగ్గర ముందస్తు చెల్లింపులకు వీలు కల్పించే డిజిటల్ సాధనాలు ఇవి. వీటి నుంచి చెల్లింపులు చేస్తే కొంత మేర క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను ఆయా సంస్థలు ప్రమోషన్ లో భాగంగా అందిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకునేవి ఈ తాయిలాలే. ఒక్కసారి వీటిని వాడడం మొదలు పెట్టిన తర్వాత ఆ ప్రయోజనాలు లేకపోయినా వాటి వినియోగం కొనసాగుతూనే ఉంటుంది.
ముఖ్యంగా కొన్ని వేదికల దగ్గర వ్యాలెట్ ద్వారా చెల్లింపులు ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. కారణాలేవైనప్పటికీ ఈ పీపీఐ వ్యాలెట్లను వాడే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరంతా ఈ నెల 28లోపు ఫుల్ కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే మీ ఖాతా నిలిపివేయడం లేదా లాక్ చేయడం జరుగుతుంది. పీపీఐలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్ బీఐ గతేడాది డిసెంబర్ లో సవరణలు చేసింది. వీటి ప్రకారం పీపీఐ కంపెనీలు పూర్తి కేవైసీలను పూర్తి చేయాలి. అంటే కస్టమర్ల నుంచి నో యువర్ కస్టమర్ (కేవేసీ) వివరాలు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి సాధారాణ సేవలు అందించగలవు. లేదంటే వ్యాలెట్ల వినియోగంపై ఆంక్షలు అమలవుతాయి. ఒకవేళ పూర్తి కేవైసీ ఇచ్చి లేకపోతే అది పూర్తి చేసుకోవడం మంచిది.
ఫుల్ కేవైసీ

ఇటీవలి కాలంలో ఈ వ్యాలెట్లలో లాగిన్ అయ్యే వారు తమ పేరు, పాన్ లేదా ఆధార్ నంబర్ తో నమోదు చేసుకుంటున్నారు. ఇది బేసిక్ కేవైసీ మాత్రమే. బేసిక్ కేవైసీ అన్నది పలు నియంత్రణలతో ఉంటుంది. ఉదాహరణకు పేటీఎంలో కనీస కేవైసీ కస్టమర్లు ఇతర వ్యాలెట్లకు డబ్బులు పంపుకోలేరు. అలాగే బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు పంపుకునేందుకు అవకాశం లేదు. అదే విధంగా వ్యాలెట్ లో రూ.10,000కు మించి లోడ్ చేసుకోలేరు.
ఆర్ బీఐ 2017 అక్టోబర్ లో కేవైసీకి సంబంధించి పీపీఐ సంస్థలకు మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. తొలుత ఫుల్ కేవైసీ నిబంధనలు పూర్తి చేసేందుకు ఏడాది గడువు ఇవ్వగా, తాజాగా ఫిబ్రవరి 28లోపే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కేవైసీ నిబంధనల నుంచి మినహాయించాలని ఆయా సంస్థలు ఆర్బీఐని గట్టిగానే కోరాయి. ఎందుకంటే 80 శాతం వాటి ఆదాయం బేసిక్ కేవైసీ అకౌంట్ల నుంచే వస్తోంది. అయినా కేంద్ర బ్యాంకు అందుకు అంగీకరించలేదు. ఒకవేళ చివరి నిమిషంలో ఏమైనా మినహాయింపు ఇస్తుందేమో చూడాలి.
ఫుల్ కేవైసీ పూర్తి చేయడం ఎలా?
ఆర్ బీఐ మినహాయింపు ఇస్తుందని చూడడం కంటే కేవైసీ నిబంధనలు పూర్తి చేసుకోవడం వినియోగం దృష్ట్యా మంచిదే. పూర్తి కేవైసీలో భాగంగా మీ వ్యాలెట్ ను ఆధార్ తో అనుసంధానించుకోవాలి. మొబైల్ నంబర్ ఆధారంగా యాప్స్ నుంచి లేదా వాటి వెబ్ సైట్ నుంచి లేదా కేవైసీ సెంటర్ కు వెళ్లి కూడా పూర్తి చేసుకోవచ్చు.
పేటీఎం

పేటీఎం అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత కేవైసీ ఐకాన్ ను సెలక్ట్ చేసుకుని 12 అంకెల ఆధార్ నంబర్, ఆధార్ కార్డుపై ఉన్న పేరును ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ అనే బటన్ ను క్లిక్ చేస్తే, చూజ్ కేవైసీ ఆప్షన్ వస్తుంది. రిక్వెస్ట్ ఏ విజిట్, విజిట్ ఏ కేవైసీ సెంటర్ ఆప్షన్లు కనిపిస్తాయి. రిక్వెస్ట్ ఏ విజిట్ ను సెలక్ట్ చేసుకుంటే మీ చిరునామా ఇవ్వాలి. దాంతో పేటీఎం ప్రతినిధి మీ చిరునామాకు వచ్చి అన్ని పత్రాలను పరిశీలించి వెళతారు. కేవైసీ సెంటర్ కు వెళ్లేట్లు అయితే ఆధార్ ఒరిజినల్ కార్డు తీసుకెళ్లాలి.
ఓలా మనీ
ఓలా మనీ అకౌంట్ ను పూర్తి కేవైసీగా మార్చుకునేందుకు ఈ లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి.
https://accounts.olacabs.com/?returnurl=https%3A%2F%2Faccounts.olacabs.com%2Fkyc%3Fcnl%3Demail
