ముల్తానీ మట్టితో సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు!

ముల్తానీ మట్టి అనేది ప్రత్యేక సుగుణాలు గల ఓ రకమైన మట్టి పదార్థం. దీన్ని ఇంగ్లిష్ లో ఫుల్లర్స్ ఎర్త్ అని సంబోధిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సౌందర్యం కోసం వినియోగించే ఎన్నో ఉత్పత్తుల్లో దీని భాగస్వామ్యం ఉంది. పారిశ్రామిక, మరెన్నో అవసరాలకూ దీన్ని వినియోగిస్తారు. ఈ మట్టితో ఉన్న ప్రయోజనాలేంటన్నది తెలుసుకుందాం...


representational imageఈ మట్టిలో ఏమున్నాయి...?
హైడ్రస్ అల్యూమినియం సిలికేట్స్ (మినరల్స్) ఉంటాయి. వీటిలో మోంట్ మోరిల్లోనైట్, కాలినైట్, అట్టాపుల్గైట్, కాల్సైట్, డోలమైట్, క్వార్ట్జ్, క్యాల్షియం బెంటోనైట్, మెగ్నీషియం క్లోరైడ్ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రపంచంలో అమెరికా, జపాన్, మెక్సికో దేశాల్లో దాదాపు 90 శాతం ముల్తానీ మట్టి తయారవుతోంది.

చర్మ రక్షణ ఉత్పత్తిగా దీనికి పేరు. దీనిలో ఉండే మెగ్నీషియం క్లోరైడ్ తో మొటిమలు తగ్గిపోతాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా లభించే ముల్తానీ మట్టి రకాలన్నీ ఒకే కాంపౌండ్లతో ఉండవు. కొన్నింటిలో వేర్వేరు కాంపౌండ్లు ఉంటాయి. అయినప్పటికీ మొత్తం మీద ఈ మట్టిని సౌందర్య కోసం వినియోగించడం ఎక్కువగానే ఆచరణలో ఉంది. మన దేశంలో ఎక్కువ శాతం ఫేస్ ప్యాక్ ఉత్పత్తుల్లో ఇది తప్పకుండా ఉంటుంది. శిరోజాల సౌందర్యానికీ ఇది ఉపయోపడుతుంది. ముల్తానీ మట్టి వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు వుండవు.

ఉపయోగాలు...
సాధారణంగా ముల్తానీ మట్టిని ప్యాక్ లా వేసుకున్నప్పుడు బాగా గట్టిపడుతుంది. దీనిలో ఉన్న కాంపౌండ్లు చర్మంపైన ఉన్న మృత కణాలను పట్టేసుకుంటాయి. అలాగే, చర్మంలోపల ఉన్న నూనె, సెబమ్ ను సైతం తొలగిస్తాయి. ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మం నిగారింపు, తెల్లగా మారేందుకు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించేందుకు ఇది ఉపయోపడుతుంది. చర్మంపైన మలినాలను కూడా తొలగించేస్తుంది. చర్మంపై ర్యాషెస్ ను కూడా తగ్గించే గుణాలున్నాయి.

representational imageమెడపై నల్లగా ఉంటే...?
ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మురికిని శుభ్రంగా వదిలించేస్తుంది. దీంతో ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్ లా చేసుకుని మెడపై ప్యాక్ లా వేసుకుంటే నల్లదనం తగ్గిపోతుంది. వారానికోసారి ఇలా చేస్తే చాలు.

నల్లమచ్చలు, మచ్చలు
దీనిలో ఉన్న మినరల్స్ చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించడంలో ఉపయోగపడతాయి. ఇందుకోసం ఇంట్లోనే ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది. ముల్తానీ మట్టి, పెరుగు, పొదీనా పొడి లేదా ఆకులు అవసరమవుతాయి. ముందుగా ముల్తానీ మట్టి, పెరుగు సమాన భాగాలను తీసుకుని పేస్ట్ లా కలుపుకోవాలి. 30 నిమిషాల తర్వాత పొదీనా కూడా ఒక భాగం తీసుకుని వీటితో కలిపేసుకోవాలి. దీన్ని నల్లమచ్చలున్న చోట ప్యాక్ లా  వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ప్రతీ రోజూ వేసుకోతగిన ఈ ప్యాక్ తో కొన్ని రోజుల్లో మార్పు కనిపిస్తుంది. ఇంకా ముల్తానీ మట్టిని, ఆలివ్ ఆయిల్, క్యారట్ గుజ్జును సమాన భాగాలుగా తీసుకుని ముఖంపై ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

representational imageమొటిమలు
చాలా మంది యువతీ, యువకుల్లో కనిపించే సమస్య ఇది. మొటిమలను ముల్తానీ మట్టి తగ్గించడంతోపాటు మళ్లీ మళ్లీ తరచుగా రాకుండా నివారించగలదు. చర్మంలోని నూనె పదార్థాలను తీసివేస్తుంది. మొటిమలను, బ్లెమిషెస్ ను నియంత్రిస్తుంది. వేపాకుల పేస్ట్ ఒక చెంచాడు, రెండు చెంచాల ముల్తానీ మట్టి, చిటికెడు కర్పూరం, రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ లా కలుపుకోవాలి. దీన్ని మొటిమలపై ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు. వారానికోసారి వేసుకుంటే సరిపోతుంది.

జిడ్డు చర్మం గల వారు
జిడ్డు చర్మం గల వారికి తరచుగా మొటిమలు వస్తుంటాయి. అందుకే జిడ్డు చర్మం గల వారు ముల్తానీ మట్టి రెండు చెంచాలు, ఒక చెంచాడు టమాటా జ్యూస్, పావు చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె అన్నీ కలిపి ముఖంపై ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి.

కమలా లేదా నారింజ పండ్ల తొక్కల పొడి, ముల్తాని మట్టిని సమాన భాగాలుగా తీసుకుని రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లయ్ చేసుకుని ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల అధికంగా ఉన్న నూనె తొలగిపోయి చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయని ఢిల్లీకి చెందిన చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ దీపాలి భరద్వాజ్ చెబుతున్నారు.

పాలిపోయిన చర్మానికి
ఎండకు పాలిపోయిన చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో ముల్తానీ మట్టి మంచిగా పనిచేస్తుంది. రెండు మూడు చెంచాల ముల్తానీ మట్టి, చెంచాన్నర కొబ్బరి నీరు, చెంచా పావు పంచదార కలిపి ముఖం, మెడపై రాసుకుని 20 నిమిషాల తర్వాత బాగా ఎండినట్టు అనిపిస్తే  తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ముల్తానీ మట్టిని, ఏదైనా సహజ నూనెతో కలిపి ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు.

ఎండలోకి వెళితే ముఖంతోపాటు పలు ఇతర  భాగాల్లోనూ చర్మం పాలిపోతుంది. అందుకోసం ఇదే మిశ్రమాన్ని శరీరమంతా ప్యాక్ లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. వారానికోసారి ఈ విధానం కొనసాగించొచ్చు. ఎండదెబ్బ ప్రభావం బాగా ఉన్న చోట దీన్ని ప్యాక్ లా వేసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. చర్మానికి కొత్త శక్తి కూడా వస్తుంది.బాగా వేడిగా ఉన్నప్పుడు ముల్తానీ మట్టిని నీటితో కిలపి శరీరమంతటికీ రాసుకుని కొం సమయం తర్వాత స్నానంచేస్తే ఉపశమనంాగా ఉంటందన.

సాగిపోయే చర్మానికి
వయసు మీద పడుతున్న కొద్దీ చర్మం సాగిపోయే గుణం పెరుగుతుంది. ముడతలు పడతాయి. అటువంటి వారు ముల్తానీ మట్టి సాయం తీసుకోవచ్చు. నేటి రోజుల్లో బాగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, నిద్ర తక్కువ కావడం వల్ల మధ్య వయసులోనూ చర్మం సాగుదల కనిపిస్తోంది. ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టి అంతే మొత్తం పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు లేకపోతే నీరు వాడుకోవచ్చు. ఓ గుడ్డును తీసుకుని అందులోని ద్రవాన్ని ఈ మిశ్రమంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ముఖం, ముడతలు కనిపించే చోట ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.

మృత చర్మం తొలగింపునకు
చర్మంలోని మృత కణాలను తొలగించడంలో ముల్తానీ మట్టికి మంచి పేరుంది. చర్మంలోని పొరల్లో ఉన్న మృత కణాలను ఇది తొలగిస్తుంది. దీంతో చర్మం గాలిని పీల్చుకోగలుగుతుంది. ముల్తానీ మట్టిని తేనె, బాదం లేదా జీడిపప్పు కలిపి మిక్సర్ లో పేస్ట్ లా చేసుకోవాలి. దీంతో ముఖాన్ని రుద్దుకుంటే మృత కణాలు, మురికి, నూనె, వైట్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయి.

చర్మం ప్రకాశవంతంగా మారేందుకు
చర్మం నిగారింపునకు ముల్తానీ మట్టి మంచి పరిష్కారం. రెండు మూడు చెంచాల ముల్తానీ మట్టి, ఒక స్పూను పెరుగు, ఒక స్పూను కీరదోస, రెండు చెంచాల శనగ పిండి, పాలు అన్నీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

నల్లమచ్చలు
కళ్ల కింద నల్లటి వలయాలు, మెడపై, ముఖంపై నల్లమచ్చలు కొందరిలో కనిపిస్తుంటాయి. అటువంటి వారు ఒక ఆలుగడ్డ కోరులో సగం తీసుకుని దానికి తాజా నిమ్మరసం, ముల్తానిమట్టి, ఒకస్పూను తాజా వెన్న కలిపిన మిశ్రమాన్ని కళ్లు మూసుకుని చుట్టూ కళ్లపై ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

representational imageకొత్త చర్మం
చర్మం తాజాదనంతో నిగారింపు సంతరించుకోవాలంటే అందుకు... ఆరెంజ్ తొక్కల పొడి, మంచి గంధం పొడి, ముల్తాని మట్టి, వీటికి శనగపిండి, తులసి ఆకుల పొడిని కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.

అలాగే చర్మంలోని మృత కణాలు, మురికి వదిలిపోవాలంటే నిమ్మరసం, పంచదార, సగ్గుబియ్యం, ఒక టీ స్పూను ముల్తానీ మట్టిని తీసుకోవాలి. ముందు సగ్గుబియ్యాన్ని, నిమ్మరసంతో కలిపి ఓ పాత్రలో ఉంచి పొయ్యి పైన తక్కువ మంటపై ముద్ద అయ్యే వరకు ఉంచి దింపేయాలి. చల్లబడిన తర్వాత దానికి పంచదార, ముల్తాని మట్టి చేర్చి బాగా కలుపుకోవాలి. ముఖంపై కళ్ల భాగం మినహా మిగిలిన ప్రాంతంలో దీన్ని రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత టవల్ ను వేడి నీటిలో ముంచి దాంతో ముఖంపై ఉన్న ప్యాక్ ను  మెల్లగా తొలగించుకోవాలి. తర్వాత మామూలు నీటితో ముఖాన్ని కడిగేసుకని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

మెరిసే జుట్టుకోసం
ముల్తానీ మట్టి శిరోజాల సౌందర్యానికీ మంచిగా ఉపయోపడుతుంది. మూడు చెంచాల ముల్తానీ మట్టిని కోడిగుగ్డు సొనతో కలిపి, దీనికి నిమ్మరసం, ఉసిరి రసం, ఒక స్పూన్ బీరు కలిపి దాన్ని శిరోజాలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేసుకుంటే సరిపోతుంది.

representational imageఅందమైన పెదాలకు
ముల్తానీమట్టిని పెదాలకు పూతలా వేసుకోవడం వల్ల వాటికి కొత్త అందం వస్తుంది. ముల్తానీ మట్టి రక్తప్రసరణ సరిగా జరిగేందుకు తోడ్పడుతుంది. దీంతో పెదాలు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వస్త్రాలపై మరకలు తొలగించడంలోనూ ముల్తానీ మట్టి ఉపయోపడుతుంది. కొన్ని రకాల సబ్బుల్లో దీన్ని ఒక పదార్థంగా ఉపయోగిస్తున్నారు.


More Articles