హార్ట్ ఎటాక్ అవునో కాదో ఈ లక్షణాలు చెప్పేస్తాయ్...!

మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఈ బాపతు ఏటా కోటి కేసులు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకే గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని, ఆ విధమైన అవగాహనతో ఉండడం ఎంతో అవసరం.


హార్ట్ ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకం అవుతుంది. ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 20 లక్షల మంది బలైపోతున్నారు. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారుంటున్నారు.

representational imageచాతీ పట్టేసినట్టు
చాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం ఇది. గుండెకు సంబంధించి ఆర్టరీ పూడుకుపోయినా, హార్ట్ ఎటాక్ లోనూ చాతిలో నొప్పి, పట్టేసినట్టు, ఒత్తిడి అనిపిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించొచ్చు. కొందరికి గుండెపై ఏనుగు కూర్చున్నట్టు ఉంటుంది. కొందరిలో నొక్కినట్టు, కాలుతున్నట్టు భావన కలుగుతుంది. కొందరిలో చాతిలో అసౌకర్యంగానూ ఉండొచ్చు. ఇదేదో ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయేది కాదు... అలా చాలా సేపు ఉంటుంది. ఏదైనా పనిచేస్తున్న సమయంలో, నిద్రలోనూ ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా చిన్న నొప్పి అయి, అలా ఉన్న చోట చేతితో అదిమినప్పుడు నొప్పి పెరిగితే అది గుండెకు సంబంధించినది కాకపోవచ్చు. వైద్య పరంగా చాతీ నొప్పిని యాంజినాగా పేర్కొంటారు. సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కనిపించే లక్షణం. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అప్పటి వరకూ గుండె జబ్బులు లేని వారు, ఉన్న వారు సైతం ఈ తరహా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆగమేఘాలపై ఆస్పత్రికి వెళ్లడం సేఫ్.

హార్ట్ ఎటాక్ సమయంలో కొంత మందిలో వాంతులు కావడం జరుగుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లో హార్ట్ ఎటాక్ సమయంలో ఇది ఎక్కువగా కనిపించే లక్షణం. ఇక కడుపులో మంట, కడుపులో నొప్పి, అజీర్తి అన్నవి తిన్న ఆహారం సరిపడక, ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందుల వల్ల కనిపించే లక్షణాలు. కానీ గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే హార్ట్ ఎటాక్ సమయంలోనూ ఇవి కనిపించొచ్చు. కనుక నిర్లక్ష్యం చేయరాదు.

representational imageచేయి, భుజం నొప్పి
హార్ట్ ఎటాక్ సమయంలో ముందుగా కనిపించే లక్షణాల్లో ఇదీ ఒకటి. నొప్పి ప్రథమంగా చాతీలో మొదలై అక్కడి నుంచి ఎడమవైపు చేతిలోకి, భుజంలోకి విస్తరిస్తుంది. హార్ట్ ఎటాక్ బాధితుల్లో ఎక్కువ మందిలో ఇది వస్తుంది. కొందరిలో రెండు చేతుల్లోనూ నొప్పి రావచ్చు. అలాగే వెన్ను, మెడ, కడుపులోనూ నొప్పి కనిపించొచ్చు.

తల తిరగడం, తల నొప్పి
బలహీనత, పోషకాహారం తీసుకోకపోవడం, ఆహారం మానేసిన సందర్భాల్లో తల తిగరడం, తలనొప్పి రావచ్చు. ఒకవేళ ఆహార పరంగా ఈ విధమైన లోపాలు లేకుండా, ఉన్నట్టుండి కళ్లు తిరుగుతూ, తలనొప్పి, చాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఆలస్యం చేయకూడదు. బీపీ పడిపోవడం, గుండె రక్తాన్ని పంప్ చేయలేని స్థితిలో ఇలా ఉంటుందని అంటున్నారు వైద్యులు.

గొంతు లేదా దవడ నొప్పి
గొంతు లేదా దవడ నొప్పి అన్నవి జలుబు, సైనస్ సమస్యల్లో కనిపించే లక్షణాలు. అయితే, కొన్ని సందర్భాల్లో గుండె నొప్పి సమయంలో చాతీ భాగంలోని అధిక ఒత్తిడి గొంతు, దవడ వైపుకు ఎగదన్నుతుందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించడం మేలంటున్నారు నిపుణులు.

అలసట, ఆయాసం, బరువు పెరగడం
గుండె ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని శరీరానికి అవసరమైనంత పంప్ చేయలేని స్థితి వల్ల అలసట, ఆయాసం కనిపిస్తాయి. గుండె పనితీరు తగ్గుతోందన్న దానికి సంకేతంగా శరీర బరువు పెరగడాన్ని అనుమానించొచ్చు. పంపింగ్ బలహీనపడి రక్తం శరీరంలోని కింది భాగాలకు సరిగా సరఫరా కాదు. దీంతో కాలి మడమలు, కాళ్లు, తొడలు, పొత్తి కడపు భాగాల్లో ద్రవాలు నిండడం వల్ల బరువు పెరుగుతారు. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరడం వల్ల రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థానంలో ఆక్సిజన్ ను నింపి పంపే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీంతో త్వరత్వరగా అలసిపోతుంటారు. నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఎంతో అలసటగా ఉంటుంది.

కాళ్లలో వాపు
గుండె శరరమంతటికీ రక్తాన్ని సరిగా పంప్ చేయలేని స్థితిలో వివిధ భాగాల్లో వాపు కనిపిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయలేకపోతే రక్తం నరాల్లోకి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో వాపు కనిపిస్తుంది. వాపు కనిపించినంత మాత్రాన అది గుండెజబ్బుగానే అనుకోవడానికి లేదు, మూత్రపిండాల వైఫ్యలంలోనూ ఇదే విధంగా ఉంటుంది. గుండె పనితీరు వైఫల్యం చెందితే అది మూత్రపిండాలపైనా పడుతుంది.

చెమట
పైన చెప్పుకున్న లక్షణాల్లో చాతీ పట్టేసినట్టు ఉండి చెమటలు పడుతుంటే మాత్రం అది హార్ట్ ఎటాక్ కు సంకేతమేనంటున్నారు వైద్య నిపుణులు.

అదే పనిగా దగ్గు
అదే పనిగా దగ్గు వస్తుంటే గుండె జబ్బే అనడానికి లేదు కానీ, గుండె జబ్బులున్నవారు, గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారిలో ఈ విధంగా నిరంతరంగా దగ్గు వస్తూ, కళ్లె పడుతుంటే వైద్యులను సంప్రదించడమే మంచిది.

గురక
గురక వస్తుంటే గుండెకు సంబంధించిన సమస్య ఉందేమో అని అనుమానించడం మంచిదే. చిన్నగా ఎప్పుడో కొద్ది సమయం పాటే రావడం వేరు. అలా కాకుండా అదే పనిగా పెద్ద శబ్దంతో వస్తుంటే మాత్రం అది స్లీప్ ఆప్నియా సమస్యకు సంకేతం కావచ్చు. దీంతో గుండెపై ఒత్తిడి పడి హార్ట్ ఎటాక్ కు దారితీయవచ్చు.

representational imageక్రమం తప్పిన గుండె లయలు
గుండె ఓ లయబద్ధంగా కొట్టుకోవాలి. అలా కాకుండా వేగంగా కొట్టుకుంటున్నా, చాలా నిదానంగా కొట్టుకుంటున్నా అది గుండెకు సంబంధించిన సమస్యకు సంకేతమే. అదేంటన్నది వైద్యులను కలసి పరీక్షించుకోవాలి.

స్త్రీలు, పురుషుల్లో భిన్నంగా
మగవారిలో గుండెపోటు సమయంలో ఎక్కువగా చాతీలో పట్టేసినట్టు, నొప్పి, ఎడమచేయి, భుజం, వెన్ను నొప్పి తరహా లక్షణాలు కనిపిస్తే... అదే మహిళల్లో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తలతిరగడం, వాంతులు, దవడ నొప్పి, వెన్ను నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో ఇంకా వీపు భాగంలో ఉండే పెద్ద ఎముకల (షోల్డర్ బ్లేడ్స్) దగ్గర నొప్పి రావచ్చు. కడుపులో పైభాగంలోనూ నొప్పి వస్తుంది.

వీరికి రిస్క్ ఎక్కువ
కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే అటువంటి వారికి రిస్క్ ఎక్కువే. అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రై గ్లిజరైడ్స్, అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), మధుమేహం, క్రమం తప్పకుండా మద్యసేవనం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లు, అధిక బరువు, శారీరక శ్రమ లేని వారు, అధిక ఒత్తిడితో కూడిన పనుల్లో ఉన్నవారు, తగినంత నిద్ర, విశ్రాంతి లేని వారికి గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువ. మహిళలతో పోలిస్తే మగవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. ముఖ్యంగా చిన్న వయసులో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. మహిళల్లోనూ మెనోపాజ్ తర్వాత రిస్క్  పెరుగుతోంది.

representational imageనిర్లక్ష్యం తగదు
పై తరహా లక్షణాల్లో ఏమున్నా గానీ, ఏం కాదులే అన్న నిర్లక్ష్యం తగదు. ముందుగా గుర్తిస్తే గుండెపోటుతో ప్రాణాపాయం తలెత్తకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. గుండె పోటు బాధితుల్లో ఎక్కువ శాతం మందిలొ ముందుగానే హెచ్చరికగా లక్షణాలు, సంకేతాలు కనిపిస్తుంటాయి. కానీ వారు వాటిని తేలికగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా తక్కువ శాతం కేసుల్లోనే హార్ట్ ఎటాక్ అప్పటికప్పుడు రావడం వల్ల ప్రాణాంతకమవుతున్న వారుంటున్నారు. గుండె జబ్బులు, గుండె వైఫల్యం అన్నది అప్పటికప్పుడు ఒక గంటలోనో, ఒక రోజులోనే అవ్వడం అసాధ్యం. చాలా ముందు నుంచే (కొన్ని నెలలు) పనితీరులో మార్పు వస్తుంది. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి, 45 ఏళ్లు దాటిన వారు ప్రతీ ఆరు నెలలకు ఓసారి, 60 ఏళ్లు దాటిన వారు ప్రతీ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఏ సమస్య అయినా ఆరంభంలోనే బయటపడుతుంది. దాంతో వైద్యులు చికిత్సతో నయం చేయగలరు. ప్రాణాపాయాన్ని నివారించగలరు.

మన దేశంలో గుండె వైఫ్యలం బారిన పడిన వారిలో 23 శాతం మంది బాధితులు ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద ఇంటర్నేషనల్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ పేరుతో నిర్వహించిన ఓ సమగ్ర సర్వేలో వెల్లడైంది. నిర్లక్ష్యం చేసి గుండె వైఫల్యాన్ని తెచ్చుకుంటే ప్రాణాంతకం అవుతుందని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. అందుకే సమస్య తొలినాళ్లలోనే వైద్యులను సంప్రదించడం వల్ల వారు మందులు, జీవన విధానం, ఆహారంలో మార్పులు సూచిస్తారు. సమస్య తీవ్రత ఉంటే ఆ సమస్య ఆధారంగా బైపాస్ సర్జరీ, ఇతర శస్త్ర చికిత్సలను సూచించే అవకాశం ఉంది.


More Articles