మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా సోకుతోంది - అంత‌ర్జాతీయ బోలు ఎముక‌ల దినోత్స‌వం - అక్టోబ‌ర్ 20న‌

డాక్టర్. సాయి లక్ష్మణ అన్నే.
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
కిమ్స్ హాస్పిట‌ల్స్‌, కొండాపూర్‌.
 
ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు వచ్చే వ్యాధి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు. ఇది సోకిన వారిలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. ఈ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 20న బోలు ఎముక‌ల వ్యాధి దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. ఈ రోజున వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుక‌వ‌స్తారు. ఈ వ్యాధి సోకిన వారికి తేలికపాటి దగ్గు వచ్చినా, లేదా వంగినా తుంటి, వెన్నెముక లేదా మణికట్టు ఎముకల్లో పగుళ్లు ఏర్పడతాయి. సాధారణంగా ఇది 35 ఏళ్లు పైబడిన మహిళల్లో, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో కనిపిస్తుంది. దీని వల్ల ఎముక విరిగిన ప్రదేశంలో కొత్త ఎముక వృద్ధి చెందదు.

ఎందుకు సోకుతుందంటే..

బోలు ఎముకల వ్యాధి కొంతమంది మగవాళ్లకు కూడా సోకుతుంది. తగినంత సూర్యరశ్మిని అందనివారు, వ్యాయామం చేయని వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఉంది. మద్యపానం, పొగతాగే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి ఆస్టియోపోరోసిస్ రావచ్చు. శరీరంలో కాల్షియం స్థాయులు తక్కువగా ఉన్నవారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. కుటుంబంలో ఇంతకు ముందే ఎవరికైనా ఈ వ్యాధి సోకితే, జన్యుపరంగానూ ఇది వ్యాపించవచ్చు. ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ మంది జిమ్ చేయ‌డం, ఏసీ జిమ్‌లు వాడుతున్నారు. పార్కులు లేదా సూర్య‌ర్శి తాకే చోట వ్యాయాయం చేయ‌డం చాల ఉత్త‌మం. దీని వ‌ల్ల శ‌రీరానికి డి విటిమిన్ ల‌భిస్తుంది. దీంతో ఎముకల బ‌లంగా మారే అవ‌కాశం ఉంటుంది.
లక్షణాలు

వెన్నునొప్పి, శరీరాకృతి వంగిపోవడం, ఎత్తు తగ్గుతున్నట్లు కనిపించడం, చిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగిపోవడం వంటివి బోలు ఎముకల వ్యాధి సాధారణ లక్షణాలు. పెన్నుపూసలో పగుళ్లు ఏర్పడితే వెన్నెముక, తుంటి ప్రాంతంలో నొప్పి వస్తుంది. సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే కొంత మంది మహిళల్లో ఇది మూపురంలా పెరుగుతుంది. తుంటి ఎముకలో ఏర్పడే పగుళ్లు (హిప్ ప్రాక్చర్) త్వరగా నయం కావు. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.

రోగ నిర్ధారణ

ఎక్స్‌రే ద్వారా  బోలు ఎముకల వ్యాధిని నిర్ధారించవచ్చు. తక్కువ లక్షణాలు ఉండే వారిలో ఎముకలు పెళుసుగా మారాయని తెలుసుకోలేరు. ఇలాంటి అతిచిన్న లక్షణాలను గుర్తించడానికి, సరైన చికిత్స అందించడానికి డిఇఎక్స్ఏ స్కాన్ (బోన్ డెన్సిటీ స్కాన్) సహాయపడుతుంది.

చికిత్స

ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సలహాతో మందులు వాడాలి. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మధ్యపానం, పొగ తాగడం మానేయాలి. ఎముకల దృఢత్వానికి విటమిన్ డి లభించే ఆహారం తీసుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి

More Press News