మిషన్ భగీరథ ప్రాజెక్టును అధ్యయనం చేయడానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఇంజనీర్ల బృందం

మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుతోనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చన్నారు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి  సురేంద్ర రామ్(IAS). భారీ ప్రాజెక్టు ఐన భగీరథను తక్కువ కాలంలో పూర్తిచేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంజనీర్ల బృందంతో వచ్చిన సురేంద్రరామ్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం, తాగునీటిని సరాఫరా చేస్తున్న తీరును యూపీ బృందానికి ఈ.ఎన్.సి వివరించారు. ఆ తరువాత మిషన్ భగీరథ నిర్వహణ, సాంకేతిక అంశాలపై కన్సల్టెంట్ నందారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టు కు కావాల్సిన అన్ని అనుమతులు ఎలా వచ్చాయో చెప్పాలని ఉత్తరప్రదేశ్ బృందం అడిగింది. వివిధ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తాము అన్ని అనుమతులు పొందామని ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి చెప్పారు. ప్రతీ ఒక్కరికి శుద్దిచేసిన తాగునీరు అందించాలన్న సిఎం కేసీఆర్ సంకల్పంతోనే  మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగిందన్నారు ఈ.ఎన్.సి. ఆ తరువాత మిషన్ భగీరథ వెబ్ సైట్,  మొబైల్ యాప్ తయారీపై  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక భగీరథలో ఉపయోగించిన జిఐఎస్, ఎంఐఎస్ పరిజ్ఞానం పై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత మాట్లాడిన సురేంద్ర రామ్ ,  భగీరథ టెండరింగ్ విధానంలోని నియమ నిబంధనలు  ప్రశంసనీయన్నారు.

ఐదు సంవత్సరాల పాటు నిర్మాణాలు, పైపుల పూర్తి బాధ్యత  వర్క్ ఏజెన్సీలపైనే  ఉంచడంతో క్వాలిటీ వర్క్ జరుగుతుందన్నారు. ముఖ్యంగా భగీరథ నిర్వహణ (O&m) కోసం అనుసరించే విధానాలు ఎంతో బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు  జగన్మోహన్ రెడ్డి, విజయ్ ప్రకాశ్, రమేష్, వినోభాదేవి, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కన్సల్టెంట్లు నందారావు, మనోహర్ బాబుతో పాటు  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press News