సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగింది: మంత్రి తలసాని

పాఠశాల స్థాయి నుండే విద్యార్ధులలో దేశ భక్తిని పెంపొందింపచేయాలి, దేశ స్వాతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

15 రోజులపాటు నిర్వహించిన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్ధుల కోసం గాంధీ చిత్రాన్ని  ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో FDC చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, CS సోమేష్ కుమార్, FDC MD, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా లతో కలిసి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణా స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, క్యూబ్, UFO, PSD డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శాలువాతో సత్కరించి మెమెంటో లను అందజేసి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి నేటితరం వారిలో అత్యధిక మందికి తెలియదని, దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం, స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలియ జెప్పాలనే ఉద్దేశంతో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని చెప్పారు.

రాష్ట్రంలోని 552 స్క్రీన్ లలో చిత్రాన్ని ప్రదర్శించగా, 22.57 లక్షల మంది విద్యార్ధులు  వీక్షించారని వివరించారు. విద్యార్ధులను తమ పాఠశాల నుండి థియేటర్ వరకు తీసుకెళ్ళి చిత్రం చూసిన అనంతరం తిరిగి పాఠశాల వరకు చేర్చే విధంగా అన్ని జాగ్రత్తలను తీసుకోవడం జరిగిందని వివరించారు. ఉచిత చిత్ర ప్రదర్శన కార్యక్రమం ఊహించిన దానికంటే గొప్పగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున మంత్రి అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గురించి దేశంలోని అనేక రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చర్చించుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో FDC ED కిషోర్ బాబు, I & PR డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

More Press News