కిమ్స్ క‌డ‌ల్స్‌లో తల్లిపాల అవగాహన వారోత్సవాలు

* వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు
 
హైదరాబాద్, ఆగస్టు 07, 2022: తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివి. పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వయసు వచ్చేవరకూ తప్పనిసరిగా పూర్తిగా తల్లిపాలతోనే పిల్లలను పెంచాలని, దానివల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సమగ్రాభివృద్ధికీ వీలుంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల అవగాహన వారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలియజేయడానికి, ఈ విషయమై అవగాహన పెంపొందించడానికి కొండాపూర్లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్లో కిమ్స్ కడల్స్ డాక్టర్. అపర్ణ, డాక్టర్ ప్రణీత రెడ్డి, డాక్టర్. అరవింద్ పాల్గొన్నారు. కొండపూర్లోని కిమ్స్ ఆస్పత్రి నుంచి మొదలైన ఈ వాక్ ఆర్టీవో రోడ్డు, నోవోటెల్ వెనక గేటు, శిల్ప పార్కు రోడ్డు మీదగా తిరిగి ఆస్పత్రికి చేరుకుంది. దాంతోపాటు, ఈ వారం రోజులూ వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆస్పత్రి వైద్యులు, యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో..          తల్లిపాలపై నర్సింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం, తల్లిపాలపై వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి క్విజ్ కార్యక్రమం, వైద్యులకు కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం చేశారు.
 
ఈ సందర్భంగా కిమ్స్ కడల్స్ డాక్టర్. అపర్ణ మాట్లాడారు. తల్లిపాలు ఇచ్చే విధానానికి ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బందికి దాని గురించిన పరిజ్ఞానం, శిక్షణ చాలా ముఖ్యం. మనమందరం తల్లి పాలివ్వడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఇది కుటుంబానికి మాత్రమే కాకుండా, మొత్తం సమాజానికి, మానవాళికి, ఈ భూగ్రహం భవిష్యత్తుకూ కీలకం.  పిల్లల స్వస్థత, మనుగడ కోసం పాలివ్వడం అత్యంత ఆదర్శవంతమైన మార్గం. తల్లి పాలు సురక్షితమైనవి, కలుషితం కానివి. అందులో యాంటీబాడీలు ఉంటాయి. శిశువులకు అత్యంత ఆవశ్యకమైన పోషణను అందిస్తాయి. న్యుమోనియా, విరేచనాలు, చెవి ఇన్ఫెక్షన్ల లాంటి అనేక సాధారణ రుగ్మతల నుంచి పిల్లలను రక్షించడానికి సహజసిద్ధమైన మార్గం ఇది. సడన్ ఇన్ ఫాంట్ డెత్ సిండ్రోమ్, ఆస్తమా, ఎలర్జీలు, డయాబెటిస్, ఊబకాయం నుంచి కూడా పిల్లలను సంరక్షిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలకు ఐక్యూ చాలా బాగుంటుంది, వాళ్ల అభ్యసన సామర్థ్యాలూ బాగుంటాయి.  తల్లి పాల బదులు డబ్బాపాలు పడితే డయేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.
 
పిల్లలకు పాలిచ్చే తల్లులకు ప్రసవ సమయంలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది, ప్రసవానంతర డిప్రెషన్ ఉండదు, పిల్లలతో మెరుగైన బంధం ఏర్పడుతుంది. ఊబకాయం, మధుమేహం, గర్భాశయ, రొమ్ము కేన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పిల్లలకు పాలివ్వడం వల్ల మాతృత్వ మరణాలు సైతం గణనీయంగా తగ్గుతున్నాయి. పిల్లలకు తల్లిపాలు పట్టడం వల్ల కుటుంబ వ్యయాలు తగ్గుతాయి, ఆస్పత్రికి వెళ్లే అవసరం తప్పుతుంది, తద్వారా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. సహజ వనరులు అంతరించవు కాబట్టి, ఇది పర్యావరణానికి కూడా చాలా అనుకూలం.
ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా.. ఆరు నెలల లోపు వయసున్న పిల్లల్లో కేవలం 40% మందికే తల్లిపాలు అందుతున్నాయి. అందుకే తల్లిపాల గురించిన అవగాహన కోసం ప్రతియేటా ఆగస్టు 1 నుంచి 7 వరకు అవగాహన వారోత్సవం నిర్వహిస్తారు. దీన్ని 1992లో వరల్డ్ ఎలయెన్స్ ఫర్ బ్రెస్ట్ఫీడింగ్ యాక్షన్ (డబ్ల్యుఏబీఏ) ప్రారంభించగా, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ 120 దేశాల్లో పాటిస్తున్నాయి. ఈ ఏడాది ఈ కార్యక్రమ థీమ్.. “తల్లిపాలు ఇవ్వడానికి సిద్ధం కండి - అవగాహన పెంచి మద్దతివ్వండి“.
 
కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో.. ప్రసవించిన ఒక గంటలోపు పిల్లలకు పాలివ్వడం ప్రారంభించమని చెబుతాం. దానివల్ల పిల్లలు తల్లి చర్మం తాకడం, రొమ్ము పట్టడం అలవాటు చేసుకోవడం, కంగారూ మదర్కేర్ ఉండటం ద్వారా ఆరోగ్యం బాగున్న పిల్లలందరికీ తల్లిపాలు అందేలా చేస్తారు. తల్లులకు ముందుగానే అవగాహన కల్పించి, దాని ప్రయోజనాలు చెప్పడం ద్వారా వారు తమ పిల్లలకు పాలిచ్చేలా ప్రోత్సహిస్తాం.
      

More Press News