బాలల సుస్ధిర అభివృద్ది ప‌ట్ల ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు త‌గిన శ్ర‌ద్ధ వ‌హించాలి: డాక్ట‌ర్ సిరి

బాలల సుస్ధిర అభివృద్ది ప‌ట్ల అయా జిల్లాల ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు త‌గిన శ్ర‌ద్ధ వ‌హించాల‌ని మ‌హిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాల‌కురాలు డాక్ట‌ర్ సిరి పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర సంచాల‌కుల వారి కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం 26 జిల్లాల పిడిల‌తో ప్ర‌త్యేకంగా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సిరి ప‌లు ఆదేశాలు జారీ చేస్తూ చిన్నారులు పోష‌ణ కోసం దాదాపు రూ.1800 కోట్లు వ్య‌యం చేస్తున్నామ‌ని త‌ద‌నుగుణంగా పూర్తి స్దాయిలో ఫ‌లితాలు రావాల‌ని సూచించారు. ఏ ఒక్క చిన్నారి నిర్దేశిత బ‌రువుకు త‌క్కువ‌గా ఉండ‌రాద‌ని, అటువంటి లోపం ఉన్న వారిని ప్ర‌త్యేకంగా గుర్తించి వారి ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల‌ని వివ‌రించారు. చిన్నారుల‌లో గ్రోత్ మానిట‌రింగ్ కు సంబంధించి చేస్తున్న కార్య‌కలాపాల‌ డేటా సురక్షితంగా ఉంచాల‌ని, ఎప్ప‌టి క‌ప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఉండాల‌న్నారు. అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు చిన్నారులు క్ర‌మ‌బ‌ద్దంగా వ‌స్తున్న‌ట్ల‌యితే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అటెండెన్స్ విష‌యంలో అవ‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. 


 ప్రీస్కూల్ విద్యార్ధుల‌కు పంపిణీ చేసిన‌ కిట్స్ ను ఆట‌వ‌స్తువులుగా భావించ‌రాద‌ని, చిన్నారుల‌లో ఆలోచ‌నా శ‌క్తిని పెంచేలా ప‌లు అంశాలు దానిలో నిభిఢీకృతం అయి ఉన్నాయ‌న్నారు. త‌ల్లుల గ్రూపుల‌కు ప్ర‌తిరోజు పంపుతున్న కార్య‌క‌లాపాలు అమ‌ల‌య్యే ట‌ట్లు చూడాల‌న్నారు. అధార్ న‌మెదును త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌ని, ప్ర‌తి చిన్నారికి అధార్ త‌ప్ప‌ని స‌రి అని డాక్ట‌ర్ సిరి పేర్కొన్నారు. స‌మీకృత చిన్నారుల అభివృద్ది ప‌ధ‌కం కింద  భారీగా నిధులు వ్య‌యం చేస్తున్నామ‌ని, ఈ క్ర‌మంలో చిన్నారుల గృహాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా త‌నిఖీ చేయాల‌ని సూచించారు. పిల్ల‌ల ద‌త్త‌త కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించాల‌ని, త‌ల్లిదండ్రులు ఉన్న వారిని వారి వ‌ద్ద‌కు పంపేలా చూడాల‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో ప్రాంతీయ సంయిక్త సంచాల‌కులు శైల‌జ‌, శ్రీనివాస‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

జారీ చేసిన వారుః మ‌హిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ సంచాల‌కుల‌వారి కార్యాల‌యం, గుంటూరు.

    


More Press News