క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీతో తెలంగాణ మంత్రుల సమీక్షా సమావేశం

హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిలు సమీక్షించారు.

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్,కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్,రాజీవ్ సాగర్,శంకర్ లూక్, ఉన్నతాధికారులు క్రిస్టినా చోంగ్తు, స్టీఫెన్ రవీంద్ర, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు,మతాలను సమదృష్టితో చూస్తున్నారని,గౌరవిస్తున్నారన్నారు.కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు.శాంతి,సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయని వివరించారు.మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా అన్ని మతాలకు సంబంధించిన ముఖ్యమైన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు.గతేడాది కరోనా కారణంగా క్రిస్మస్ వేడకలను అధికారికంగా జరుపలేకపోయామని చెప్పారు.ఈ సారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.క్రిస్టియన్ సమాజంలోని సుమారు రెండున్నర లక్షల మంది పేదలకు 11కోట్ల 50లక్షలు ఖర్చుతో దుస్తులు సిద్ధం చేశామని తెలిపారు.వీటిలో చాలా వరకు జిల్లాలకు పంపడం జరిగిందని,ఈ నెల 17వ తేదీ వరకు 95 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పంపిణీ పూర్తి చేస్తారని వివరించారు.

ఎల్.బి.స్టేడియంలో ఈ నెల 21 లేదా 22వ తేదీలో జరిగే ప్రధానమైన వేడుకలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రి తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలకు క్రిస్టియన్ బిషప్ లు, ఫాదర్స్, ఫాస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్ పెద్ద సంఖ్యలో హాజరవుతారని కొప్పుల పేర్కొన్నారు. దుస్తుల పంపిణీ, ఆహ్వానాలు,స్టేజీ అలంకరణ, స్వాగతం, సత్కారాలు, భోజనాలు, తాగునీరు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి కొప్పుల అధికారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేసిన దుస్తులను మంత్రులు విడుదల చేశారు. ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించేందుకుగాను జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సవివరంగా చర్చించేందుకు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం (రేపు అంటే బుధవారం ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు.

More Press News