మీడియా భవనం నవంబర్ లోగా పూర్తి చేయాలి: అల్లం నారాయణ

హైదరాబాద్: మీడియా అకాడమి భవనం నవంబర్ లోగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సంబంధిత కాంట్రాక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు. నవంబర్ లోగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్, ఇంజనీర్లు చెప్పారు.

బుధవారంనాడు నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మన్ అల్లం నారాయణ పరిశీలించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి నవంబర్ లోగా జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీడియా అకాడమి భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా నిర్మిస్తున్నట్లు ఇందులో 200 మందికి సరిపడే విధంగా ఆడిటోరియంను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని మీడియా అకాడమి కార్యదర్శికి సూచించారు.

ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి ఎండీ ముర్తుజా, కాంట్రాక్టర్ నర్రా శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నర్సింగరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజనీర్ నితిన్, తదితరులు పాల్గొన్నారు.

More Press News