జూన్ 15 నాటికి కొత్త లిఫ్ట్ లకు డీపీఆర్ లు సిద్ధం చేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

  • జలసౌదలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్ ల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం
  • హాజరైన శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు
  • పాల్గొన్న ఇయన్ సి మురళీధర్ రావు, గజ్వేల్ ఇయన్ సి హారేరామ్, నల్లగొండ, సూర్యాపేట చీఫ్ ఇంజినీర్లు శ్రీకాంత్, రమేష్ బాబులు
హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించతలపెట్టిన లిఫ్ట్ ల డీపీఆర్ లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొత్త లిఫ్ట్ ల డీపీఆర్ లు జూన్15 నాటికి అందజేసిన పక్షంలో సంవత్సరాంతానికి నిర్మాణాలు పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

డీపీఆర్ లు అందిన వెంటనే టెండర్లు పూర్తి చేసి సత్వరమే నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్ట్ ల నిర్మాణాల పురోగతిపై నీటిపారుదల అధికారులతో సమన్వయం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భోనగిరి, ఆలేరులను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించబడిన గందమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలతో పాటు 40 కిలోమీటర్ల మేర కాలువ గట్ల వెంట స్వయంగా పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్యాకేజ్ 14&16లపై బసవపూర్ రిజర్వాయర్ నిర్మాణ స్థలం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే.

అందుకు కొనసాగింపుగా శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రాజధానిలోని జలసౌదలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లిఫ్ట్ ల నిర్మాణాలతో పాటు యస్ఆర్ యస్ పి 69,70,71 డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఆధునీకరణ, అయిటిపాముల లిఫ్ట్ నిర్మాణం, బునదిగానికాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లయిపల్లి కాలువ నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

తుంగతుర్తి శాసనసభ్యుడు గాధరి కిశోర్ కుమార్, నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యలతో పాటు నీటిపారుదల శాఖా ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, గజ్వేల్ ఇయన్ సి హరేరామ్, నల్లగొండ, సూర్యపేట జిల్లాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు శ్రీకాంత్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జులై మాసాంతానికి బసవపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు వీలుగా రేయింబవళ్లు పనులు చేసే విదంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారన్నారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు బసవపూర్ కు కాళేశ్వరం జలాలు అందించగల్గుతామన్నారు.

యస్ఆర్ యస్ పి 69,70,71 డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను మూడు రోజుల్లో అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అంతే గాకుండా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని అయిటిపాముల లిఫ్ట్ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. బునదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లయిపల్లి కాలువల నిర్మాణాల వేగాన్ని పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.

More Press News