విత్తన గణపతిని పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం, ఆగస్టు, 20: కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారి ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విత్తన గణపతిని పంపిణీ చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా గురువారం vdo's క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత(వ్యక్తిగత) నిధులతో 2 వేల విత్తన గణపతి లను ఏర్పాటు చేసి ఖమ్మం కార్పొరేషన్ 50 డివిజన్ ల పరిధిలో ఒక్కో డివిజన్లలో మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వినాయక చవితికి విత్తన గణపతి ని పూజిద్దామని ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ సంకల్పాన్ని బలపరుద్దామని అన్నారు.

కోవిడ్ అనివార్య పరిస్థితుల వల్ల అనేక పండుగలు ఘనంగా జరుపుకోలేకపోయామని, ప్రజలు ఒకే చోట గుమిగూడే అవకాశమున్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో కూడా జనం ఎక్కువగా గుమ్మికుడే అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడడమే అతి ముఖ్యం కాబట్టి సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటి పైనా నియంత్రణ కొనసాగుతుందన్నారు.

కరోనా వైరస్ పై పోరాడడంలో భాగంగా సామూహిక ఉత్సవాలకు అనుమతి ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలు ఇచ్చింది. అందులో భాగంగా గత మార్చి 16 నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ప్రజలు ఎవరిళ్లలో వారే నిర్వహించుకుంటున్నారని అందుకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, జగ్నే కీ రాత్, బోనాలు, బక్రీద్ తదితర పండుగలు సామూహికంగా కాక ఎవరిళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రభుత్వ పరంగా జరిపే స్వాతంత్ర్య దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చాలా నిరాడంబరంగా, చాలా తక్కువ మందితో జరిగింది. ఈ నెలలో 22వ తేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రంను కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పువ్వాడ కోరారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మతాల పండుగలను, ఉత్సవాలను ఏ విధంగానైతే ఎవరిళ్లలో వారు జరుపుకుని, కరోనా వ్యాప్తి నిరోధానికి సహకరించారో వినాయక చవితి, మొహర్రం విషయంలో కూడా అదే స్పూర్తి కొనసాగించాలని కోరారు. ఎవరిళ్లలో వారే వినాయకుడికి పూజలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సామూహిక ప్రార్థనలు, ఊరేగింపుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా సామూహికంగా వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం నిర్వహించుకోవడానికి, ఊరేగింపులు జరపడానికి, నిమజ్జనానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయదానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు.  వచ్చే ఏడాది కోవిడ్ ప్రభావం ఉండదని అన్ని పండుగనలను అత్యంత వైభవంగా జరుపుకుందామని అన్నారు. అందుకే ఈ నెల 22న జరిగే గణేష్ చతుర్థి ని నిరాడంబరంగా జరుపుకోవాలని, ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని, ఎవరి ఇళ్లలో వారు ఉత్సవాలు, పండుగలు, మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించుకుని సహకరించగలరని సవినయంగా కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా విత్తన గణపతిని స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

More Press News