తూర్పు గోదావరి జిల్లా పార్టీ నాయకులతో సమీక్ష చేసిన వైవీ సుబ్బారెడ్డి

  • జూమ్ ద్వారా తూ. గో. జిల్లా పార్టీ సమీక్ష చేసిన వైవీ సుబ్బారెడ్డి
వైఎస్ఆర్సీపీ ఐదు జిల్లాల బాధ్యులు ( రీజనల్ ఇంచార్జ్ ) వైవీ సుబ్బారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదు కావడంపై పార్టీ  నాయకులతో సమీక్ష నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్ష్యులు, నియోజక వర్గ ఇంచార్జ్ లు ఇతర ముఖ్య నేతలతో ఈ సమీక్ష జరిపారు.

వైవీ సుబ్బారెడ్డి తూ. గో, ప.గో. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల పార్టీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తూ. గో. జిల్లాలో అత్యధికంగా కోవిడ్ 19 కేసులు నమోదు అవుతుండటం, బాధితులకు ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలు, పార్టీ పరంగా తీసుకుంటున్న చర్యల గురించి ఆయన నియోజక వర్గాల వారీగా చర్చించారు. కోవిడ్ బాధితులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు జరిగేలా చూడాలని ఆయన నాయకులకు సూచించారు.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరీ అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులందరి మీద ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు. అర్హులకు ఎక్కడైనా పథకాలు అందకపోతే చొరవ తీసుకుని న్యాయం చేయాలని సుబ్బారెడ్డి పార్టీ నాయకులకు నిర్దేశం చేశారు.

త్వరలో భర్తీ చేయనున్న 52 బిసి కార్పొరేషన్ లకు ఛైర్మన్ లు, డైరెక్టర్ల నియామకం కోసం ఇంచార్జ్ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కలసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి పేర్లు సిఫారసు చేయాలన్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ వారందరికీ భరోసా ఇచ్చేలా ఈ ఎంపికలు ఉండాలని సుబ్బారెడ్డి సూచించారు.

ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్న బాబు, విశ్వరూప్, వేణుగోపాల్, ఎంపీలు భరత్, అనురాధ, వంగా గీతతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సమీక్ష అనంతరం వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానితో ఫోన్ లో మాట్లాడారు. తూ. గో. జిల్లాలో కోవిడ్ కేసులు తీవ్రమవుతున్నందు వల్ల ఒకటి, రెండు రోజుల్లో ఆ జిల్లాకు వెళ్ళి పరిస్థితులను సమీక్షించాలని ఆయన కోరారు.

More Press News