డిస్కంలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది: విద్యుత్ పై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక ప్రేరణ అందించడంతోపాటు, అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో అద్భుత పనితీరు ప్రదర్శించి దేశానికే ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. విద్యుత్ సంస్థల పనితీరుపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉన్నందున వాటిని కాపాడుకుని తీరుతామని చెప్పారు. కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే విధానం తమదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇకపై ప్రతీ నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా కఠినమైన విధానం అవలంభిస్తామని వెల్లడించారు. విద్యుత్ కు సంబంధమైన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి గ్రామాలు, పట్టాణాల్లో త్వరలోనే ‘పవర్ వీక్’ నిర్వహించనున్నట్లు తెలిపారు.

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, జెన్ కో - ట్రాన్స్ కో సిఎండి శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి శ్రీ జి. రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి శ్రీ గోపాల్ రావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీ శ్రీనివాసరావు, స్పెషల్ సిఎస్ శ్రీ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్రీ ఎస్. నర్సింగ్ రావు, శ్రీ రామకృష్ణ రావు, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ దాన కిశోర్, నీటి పారుదల శాఖ ఇ.ఎన్.సి. శ్రీ మురళీధర్ రావు, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలది చాలా కీలకమైన పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. నేడు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందులో విద్యుత్ అధికారులు, ఉద్యోగుల శ్రమ, చిత్తశుద్ధి ఉంది. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించుకోగలుగుతున్నాము. మెరుగైన విద్యుత్ వల్ల పారిశ్రామికాభివృద్ధి జరిగింది. విద్యుత్ సంస్థలు మరింతగా వృద్ది చెందాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దు. అదే సమయంలో తెలంగాణలో కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు. అందుకోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. వాడిన కరెంటుకు తప్పక బిల్లు చెల్లించాలి. ఇప్పటి నుంచి ప్రతీ నెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్. తప్పక బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్ పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను ఒన్ టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను జీరో సైజుకు తెస్తాం. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు కూడా లైట్లు వెలగకుండా చూసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలి. అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందివ్వడానికి, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బడ్జెట్లోనే ప్రత్యేక గ్రాంటు కేటాయించి, ప్రతీ నెలా విధిగా విద్యుత్ సంస్థలకు అందిస్తుంది. విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి వీలుగా నిధులు సమకూర్చుకోవడానికి అవసరమైన చోట ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో ఏడు రోజుల పాటు ‘పవర్ వీక్’ కూడా ఉంటుంది. ఆ సమయంలో వంగిన పోళ్లను సరిచేయడం, ఒరిగిన లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చేయడం తదితర పనులను నిర్వహిస్తాం. అదే సందర్భంలో సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుందీ, ఎంత బిల్లు వస్తుందీ అనే విషయాలను శాస్త్రీయంగా మదింపు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాల్లో సబ్ స్టేషన్లు పెట్టడానికి, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికోసం పట్టణాలు, నగరాల్లో చేసే లే అవుట్లలో ఖచ్చితంగా విద్యుత్ అవసరాలకు తగిన స్థలం కేటాయించేలా ప్రభుత్వం విధానం తెస్తుంది’’ అని సీఎం వెల్లడించారు.

ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం? దాన్ని ఎలా సమకూర్చాలి? అనే విషయంపై నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని సీఎం చెప్పారు.

ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండును తట్టుకునేందుకు, తక్కువ ధరకు లభ్యమయ్యే సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు ఎప్పుడు అవసరం ఏర్పడినా తీర్చగలిగే ఆర్థిక విధానం రూపొందించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి కోరారు.

More Press News