నేషనల్ హైవేలపై "హైవే నర్సరీలు" పెంచడానికి అనువైన స్థలాలు గుర్తించాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • జాతీయ రహదారులు పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండాలి
  • ఈఏడాది హరితహారంలో భాగంగా ఆర్ అండ్ బి రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలి
హైదరాబాద్: ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో  చేపట్టబోయే హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సంబంధిత శాఖ అధికారులతో ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి కార్యాలయంలో వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన రంగు రంగుల మొక్కలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి ఈ సందర్భంగా అధికారులతో అన్నారు.రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు ప్రకృతిని ఆస్వాదించే విధంగా,చూపరులను ఆకట్టుకునే విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక అన్నారు.

హరితహారంలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ పెద్ద ఎత్తున మొక్కలు నాటి,వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేషనల్ హైవేలపై "హైవే నర్సరీలు" ఏర్పాటు చేయాలన్నారు. హైవేలపై నర్సరీలు పెంచడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో గల రోడ్లపై 20 అనువైన స్థలాలను గుర్తించాలని,ఆర్ అండ్ బి ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేలపై 25 నర్సరీల స్థలాలు గుర్తించాలని అన్నారు. వీటికి "హైవే నర్సరీలు"గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారన్నారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో 800 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా మరియు సెంట్రల్ మీడియంలో ఈ సారి హరితహారం కార్యక్రమంలో 3.30 లక్షల మొక్కలు నాటి,వాటిని సంరక్షించేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని NHAI తెలంగాణ రీజినల్ ఆఫిసర్ కృష్ణ ప్రసాద్ మంత్రి తో అన్నారు. స్టేట్ పరిధిలోని నేషనల్ హైవే లపై 300 కి.మీ రోడ్లపై 50 వేల మొక్కలు,25 కలెక్టరేట్లో 1000 మొక్కలు చొప్పున మొత్తం 75 వేల మొక్కలు ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి మంత్రి కి చెప్పారు.

అలాగే ఆర్ అండ్ బి శాఖ అధీనంలో ఉన్న 20 గెస్ట్ హౌస్ లలో నర్సరీలు పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో నర్సరీలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నర్సరీల ద్వారా వచ్చే మొక్కలను ఖాళీ ఏర్పడ్డ స్థలాలను పూరించేందుకు ఉపయోగించాలని సూచించారు.

స్టేట్ రోడ్స్: ఆర్ అండ్ బి శాఖ స్టేట్ రోడ్స్ పరిధిలోని 2458 కి.మీ మేర ఉన్న రోడ్లకు ఇరువైపులా 9 లక్షల 97 వేల 326 మొక్కలు ఈ సారి హరితహారం కార్యక్రమంలో నాటేందుకు చర్యలు చేపట్టామని ఈఎన్సీ రవీందర్ రావు చెప్పారు. గ్రామాలకు దగ్గర లో ఉండే రోడ్ల పై నరేగా ద్వారా జి.పి ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని,గ్రామాలకు దూరంగా ఉన్న రోడ్లు పై అటవీశాఖతో నాటించాలని మంత్రి ఆదేశించారు.

ఆర్ అండ్ బి శాఖ అధికారులు  రూరల్ డెవలప్మెంట్, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హరితహారం కార్యక్రమం విజవంతం అయ్యే విధంగా చూడాలని తెలిపారు.ఆయా జిల్లాలో ఆర్ అండ్ బి ఎస్.ఈ లు అట్టి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు,NHAI రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, సి.ఈ ఆషారాణి,చందూలాల్,అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press News