డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వవిద్యాలయాలలో పూర్వ విద్యార్ధుల అసోసియేషన్లను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని సూచించారు. తల్లిదండ్రులను ఎలాగైతే ఎదిగిన పిల్లలు ఆదరిస్తారో అలాగే పూర్వ విద్యార్ధులు కూడా తమ విశ్వవిద్యాలయాలను ఆదరించి అభివృద్ధి చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గవర్నర్ గుర్తు చేసుకున్నారు.

తాను చదివిన మద్రాసు మెడికల్ కాలేజీలోని బ్రిటీష్ కాలంనాటి అనాటమీ ల్యాబ్ శిధిలావస్థలో ఉన్నప్పడు తాము ఆ కళాశాల పూర్వ విద్యార్ధుల సహాయం కోరగా వారు గొప్పగా స్పందించి విరాళాలు ఇచ్చి అనాటమీ ల్యాబ్ ను పునరుద్ధరించుకోగలిగినామని గవర్నర్ తెలిపారు. పూర్వ విద్యార్ధులు ప్రతి విద్యా సంస్ధకు గొప్ప మానవ, ఆర్ధిక వనరులు అని గవర్నర్ వివరించారు. ఈ సందర్భంగా కోవిడ్ సంక్షోభ సమయంలో విశ్వవిద్యాలయాలు తమ విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్నాయో తెలపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించారు.

ఆన్ లైన్ పరీక్షలు లేదా ఇతర పద్ధతుల ద్వారా విద్యార్ధుల రక్షణకు భంగం కలుగకుండా పరీక్షలు ఎలా నిర్వహించుకోగలమో సూచించాలని విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో ముందు వరుసలో నిలపడమే తన లక్ష్యమని దీనికై అందరూ తమతమ పరిధిలో శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వవిద్యాలయ విద్యను ఉన్నతంగా తీర్చిదిద్ధడానికి నాలుగు “E” ల మంత్రాన్ని సూచించారు. అవి 1) ఎంజాయ్, 2) ఎడ్యుకేట్, 3) ఎంప్లాయ్, 4) ఎంపవర్.

ప్రతి విశ్వవిద్యాలయం తమతమ విస్తృత విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, సంయుక్త కార్యదర్శులు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసందాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె.రాజారామ్ పాల్గొన్నారు.

More Press News