జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి

నల్గొండ: జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఏజెన్సీల నిర్లక్ష్యంతో మిగితా పనులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే తక్షణ కర్తవ్యమని ఆయన తెలిపారు.

మిషన్ భగీరథ పురోగతి పై బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైనదన్నారు. ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు  త్రాగు నీటి మీద 590 కోట్లు ఖర్చు పెడితే కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో ఒక్క నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ పధకం కింద2,950కోట్లు ఖర్చు పెట్టి సురక్షితమైన నీరు అందించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు.

అటువంటి ప్రాజెక్ట్ చేపట్టడానికి మూలం నల్గొండ జిల్లాయే నన్నారు. సురక్షితమైన మంచినీరు అందించేందుకు చేపట్టిన ఇటువంటి బృహత్తర పథకం చేపట్టిన ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే మరో 5 శాతం పనులు మిగిలి పోయాయన్నారు. అటువంటి ఏజెన్సీల కు నోటీసులు ఇచ్చి మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. నదీజలాలను నేరుగా ఇంటింటికీ సరఫరా చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. నల్గొండ జిల్లాలోని 33 మండలాలకు గాను 1536 ఓ హెచ్ యస్ ఆర్ లు మంజూరు కాగా 1509 ఇప్పటికే నిర్మించడం జరిగిందన్నారు. మిగితా 27 ట్యాన్క్ లు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విదంగా జిల్లాలోని 3 లక్షల 30 వేల 939 ఇండ్లకు నల్లాలు మంజూరు కాగా 3 లక్షల 15 వేల 83 ఇండ్లకు ఇప్పటికే బిగించినట్లు ఆయన చెప్పారు.

దానితో పాటే చేపట్టిన 4 వేల 149 కిలో మీటర్ల  పైప్ లైన్ నిర్మాణానికి గాను 4,033 కిలో మీటర్లు పూర్తి చేశామన్నారు.2014 ముందు వరకు స్వాతంత్ర్యం వచ్చిన రోజునుండి మొదలు పెడితే వారు వేసిన పైప్ లైన్ నిర్మాణం కేవలం 816 కిలోమీటర్లు మాత్రమే నని ఆయన ఎద్దేవా చేశారు. వేసవి వచ్చిందంటే వణుకు పుట్టెదని ఖాళీ కుండలు ,బిందెల ప్రదర్శన లు ఉండేవని 2014 తరువాత అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదన్నారు. యావత్ భారతదేశానికి  మిషన్ భగీరథ పధకం రోల్ మోడల్ గా మారిందన్నారు.ప్రధాని మోడీ చేపట్టిన మన్ కీ బాత్ కు మూలం మిషన్ భగీరథ పథకమే నన్నారు.

సర్పంచ్ లు సంతకాలు పెట్టకండి: జగదీష్ రెడ్డి

మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్ లు పూర్తి అయినట్లు సంతకాలు పెట్టకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగొడలో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడానికోసమే నన్నారు. వేగవంతంగా పనులు జరుగుతున్నప్పటికీ అక్కడక్కడా ఏజెన్సీల నిర్లక్ష్యంతో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 843 గ్రామ పంచాయతీ లు 1670 అవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటి లను కలుపుకుని మొత్తం 1689 అవాసలలో మిషన్ భగీరథ పథకం కింద నీళ్లు ఇచ్చినట్లు ఆయన వివరించారు.

ప్రారంభించిన మూడేండ్లలోనే పూర్తి  చేసుకుని సురక్షితమైన త్రాగు నిరందించేందుకు ఉద్దేశించ బడిన ఈ పధకం అమలులో అధికారులు కఠినంగా వ్యహరించాలన్నారు. ఇంకా ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్. రవీంద్ర కుమార్, నోముల నరసింహామయ్య, ఎన్. భాస్కర్ రావు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇ యన్ సి కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press News