బ్యాటరీతో నడిచే వాహనాలను పంపిణీ చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్: ఎంతో ప్రజాదరణ కలిగిన విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయడలనేదే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం లాలాపేటలోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం మొదటి విడతగా 15 బ్యాటరీతో నడిచే వాహనాలు (మొబైల్ ఔట్ లెట్స్)ను సబ్సిడీపై లభ్దిదారులకు డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాస రావు, తార్నాక కార్పొరేటర్ అలకుంట్ల సరస్వతిలతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్ళడానికి నూతన ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100, పాత 10 జిల్లాలలో ఒక్కో జిల్లాకు 10 చొప్పున మరో 100 బ్యాటరీతో నడిచే వాహనాల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. వీటిని భవిష్యత్ లో 1000 వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఈ వాహనం ఒక్కోదాని ధర 2.25 లక్షల రూపాయలు కాగా, ఇందులో డెయిరీ 30 శాతం, లబ్దిదారుడు 70 శాతం భరించడం జరుగుతుందని తెలిపారు. నూతన ఔట్ లెట్ ల ఏర్పాటుతో విజయ విక్రయాలను పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఉపాది కల్పిస్తున్నట్లు వివరించారు. హైవేలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు తదితర ప్రాంతాలలో నెల రోజులలో మరో 500 ల నూతన ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు విజయ డెయిరీ అభివృద్ధిపై ప్రత్యేక ఆలోచనతో ఉన్నారని వివరించారు.

అసెంబ్లీలో విజయ డెయిరీ అభివృద్ధిపై ప్రస్తావించారంటే ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్దను తెలియజేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఎక్కడా లేని విధంగా పాడి రైతులను ప్రోత్సహించడానికి లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్శాహకం అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సబ్సిడీపై పాడి గేదెల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. గతంలో రైతులు పాల బిల్లుల కోసం ఎదురు చూసేవారని, కానీ ప్రస్త్తుతం పరిస్థితి మారి 24 గంటలలో రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్దిలోకి తీసుకెళ్ళే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండా పాడి గేదెల కొరకు ఒక లక్ష 60 వేల రూపాయల వరకు బ్యాంకుల నుండి ఋణం ఇవ్వడం జరుగుతుందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకునేల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. విజయ డెయిరీ సంస్థలోని అందరు తమ సొంత సంస్థగా భావించి శ్రమించిన ఫలితంగానే అభివృద్ధి పథంలోకి పయనిస్తుందని, మరింత కృషి చేసి దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్ళవచ్చని అన్నారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బందికి తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

More Press News