పదవ తరగతి పరీక్షలపై టీ-శాట్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం!

కోవిడ్ కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన ప్రసారాలను అందిస్తున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. జూన్ ఎనిమిదవ తేదీ నుండి జరగబోయే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలని తెలిపారు.

అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులచే నాలుగు సబ్జెక్టులు జూన్ రెండవ తేదీ మంగళవారం మ్యాథమేటిక్స్ మొదటి పేపర్ తో ప్రారంభమై ఐదవ తేదీన ఆంగ్లంతో ముగుస్తాయన్నారు. ఒక్కో పేపర్ కు గంట పాటు ప్రసారమయ్యే అవగాహన ప్రసారాలు రెండవ తేదీన గణితం మొదటి పేపర్ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు, రెండవ పేపర్ మధ్యాహ్నాం రెండు గంటల నుండి మూడు గంటల వరకు అదే సమయాల్లో జూన్ మూడవ తేదీన సైన్స్,  నాల్గవ తేదీన సోషల్, ఐదవ తేదీన ఇంగ్లీష్  పేపర్లపై అవగాహన ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ ప్రసారాలను విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులూ అనుసరించి పిల్లల్లో అవగాహన కల్పించాలని సీఈవో సూచించారు. విద్యార్థులు వారి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెం.1800 425 4038, ఫోన్ నెం.040 23553473 సంప్రదించాలని కోరారు.

More Press News