దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ నంబర్ వన్!

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి డివి. ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు డివి ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిపాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు స్పష్టం చేశారు. ఈ సారి ఎఫ్.సి.ఐ. 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సమకూర్చిందని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది, దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్.సి.ఐ. బుధవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది.

కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 6,386 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 55.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఎఫ్.సి.ఐ సిఎండి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు.

గతంలో సాగునీటి సౌకర్యం లేక, కరెంటు సరిగా లేక తెలంగాణలో పంటలు సరిగా పండకపోయేది. దీంతో ధాన్యం, ఇతర పంటల దిగుబడి తక్కువ వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగింది.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వల ద్వారా, ఇటు చెరువుల ద్వారా, మరోవైపు బోర్ల ద్వారా పుష్కలమైన నీరు వాడుకోవడం సాధ్యమైంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 39.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. దీని ఫలితంగా తెలంగాణలో వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు, దేశ అవసరాలను కూడా తీరుస్తున్నది.

రైతులకు ముఖ్యమంత్రి అభినందన:

దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి సేకరించిందే అత్యధిక భాగమని ఎఫ్.సి.ఐ. ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అభింనందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరిగాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దేశానికి అవసరమైన ధాన్యంలో ఎక్కువ శాతం తెలంగాణ నుంచి వెళ్లడం వెనుక కేసీఆర్ దార్శనికత ఉందన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

More Press News