ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఈ వైరస్ ను నిర్మూలించగలం: నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డా. స్వరూప రెడ్డి

కరొనా వైరస్ నివారణకు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఈవైరస్ ను నిర్మూలించగలమని నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరొనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి, అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ నాగరాజులు మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ స్వరూప రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రబలుతుందని అన్నారు. ఈవైరస్ బీటా కరొనా కుటుంబానికి చెందింది అని,మిగతా వైరస్ కంటే ఈవైరస్ బరువు ఎక్కువ అని అన్నారు. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే దీనిని అరికట్టవచ్చని అన్నారు. వైద్య, పోలీస్‌, అగ్నిమాపక, ఇతర శాఖలు ఈ కరోనా వైరస్‌ నిరోధానికి అహర్నిశలూ కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను గౌరవించి అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పారు.

తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించవచ్చని తెలిపారు.  కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దగ్గు వస్తుందని, ఈ దగ్గు ఒక్కోసారి గంట వరకు ఉంటుందని తెలిపారు.  అలానే జ్వరం తలనొప్పి కూడా వస్తాయని,అదే విధంగా శ్వాస  తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు.  ఈ లక్షణాలు ఉంటె కరోనా వైరస్ వచ్చినట్టే అని చెప్పొచ్చని అన్నారు.  ఈ లక్షణాలను గుర్తిస్తే  వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. 

సెంట్రల్ ఏసీలకు దూరంగా ఉండాలని తెలిపారు. డిస్చార్జ్ అయిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని ,ఇంట్లో నే ఉండాలని అన్నారు. న్యూస్ పేపర్, పాల పాకెట్ల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్లాస్టిక్, స్టీల్, వంటి వస్తువులు పై వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని, ఎక్కువ సార్లు చేతులను శుభ్రంగా కడగాలని తెలిపారు.ఈ వైరస్ కు వాక్సిన్  ప్రయోగ దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఐసీయంఆర్ సూచనల ప్రకారం భాదితులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. క్వారంటైన్ కాలం పొడగించటం వల్ల బాధితులకు మరింత మేలు చేకూరుతుందని అన్నారు.

అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగరాజు గొర్ల మాట్లాడుతూ విధిగా చేతులు కడుకోవడం తో చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నారు.చేతులను కనీసం 30 సెకన్ల పాటు సానిటైజర్ తో కానీ 60 సెకన్ల పాటు కడుకోవాలన్నారు.కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారు డిశ్చార్జ్ ఆయిన తర్వాత కూడా  14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలన్నారు.చంటిబిడ్డలకు తల్లి పాలు ఇస్తే వైరస్ సోకే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి వలన చనిపోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు.

వైద్యుల సలహా మేరకే క్లోరోక్విన్ వాడలే తప్ప ఇష్టం వచ్చి నట్లు వాడితే వేరే ఆరోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వయస్సు లో పెద్ద వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లడ్ షుగర్స్ ను అదుపులో ఉంచుకోవలన్నారు.వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని  కచ్చితంగా పాటించాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను పాటిస్తునే మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు.రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తో పాటు వ్యాయామం , యోగ, ధ్యానము లాంటి చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, ఇంచార్జి సి.ఐ.ఇ. విజయభాస్కర్ రెడ్డి, డిడి శ్రీనివాస్,  ఆర్.ఐ.ఇ.  రాధా కిషన్ , ఏడి యామిని,తదితరులు పాల్గొన్నారు.

More Press News