నూతన మున్సిపల్ బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం!

పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్నినియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల అంశంపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

- వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న పెన్షన్ ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్ ను 2019 జూన్ మాసం నుంచి అమలు చేస్తారు. జూన్ మాసానికి సంబంధించిన పెన్షన్ ను జూలై నెలలో లబ్దిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
- పెంచిన పెన్షన్లు అందించడానికి సంవత్సరానికి రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుంది. దీంట్లో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, రూ.200 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.

- వృద్దాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్దిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

- బీడీ కార్మికుల పి.ఎఫ్. కటాఫ్ డేట్ ను తొలగించాలని నిర్ణయించింది. బుధవారం (17-07-2019) నాటి వరకు కూడా పి.ఎఫ్. ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించింది.

- నూతన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. గురువారం ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీలో, శాసనమండలిలో బిల్లుపై చర్చ జరుగుతుంది.

More Press News