కరోనా కట్టడికి తెలంగాణ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి: కేంద్రమంత్రి

  • రాష్ట్రాన్ని అభినందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా
  • గిరిజనులకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కు ఫోన్ 
  • లాక్ డౌన్ వల్ల అంగన్ వాడీల ద్వారా గిరిజనులకు నిత్యావసరాలు అందిస్తున్నాం
  • వైద్యసేవల్లో లోటు ఉండొద్దని ఐటీడీఏ, కలెక్టర్లకు ఆదేశాలు
  • రాష్ట్రంలో కరోనా కట్టడికి గిరిజనుల కోసం తీసుకుంటన్న చర్యలను వివరించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 : కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కొనియాడారు. ఈరోజు కేంద్ర మంత్రి అర్జున్ ముండా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో ఫోన్లో మాట్లాడి, ఇక్కడ గిరిజనుల కోసం కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కోసం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యవతి కేంద్ర మంత్రితో తెలిపారు.

లాక్ డౌన్ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సిఎం కేసిఆర్ గారి మార్గదర్శనంలో నుంచి అందించే రేషన్ బియ్యం, అంగన్ వాడీ ద్వారా అందించే పాలు, గుడ్లు, నిత్యావసర వస్తువులు ఎలాంటి అంతరాయం లేకుండా అందిస్తున్నామని వివరించారు. మొదటి దశలో 12 రోజులకు సరిపడా బియ్యం, పాలు, గుడ్లు, నిత్యావసరాలు, బాలామృతం అందించామని, నిన్నటి నుంచి రెండో విడతలో భాగంగా మరో 12 రోజులకు సరిపడా అందిస్తున్నామన్నారు.

లాక్ డౌన్ సందర్భంగా వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐటీడీఏల ద్వారా, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు, చిన్న పిల్లలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని, ఇకపై కూడా రాకుండా చూసుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు.

రాష్ట్రంలో గిరిజనుల కోసం లాక్ డౌన్ సందర్భంగా తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని, మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో ముందంజలో ఉందన్నారు.

More Press News