మ‌హిళ‌కు అత్యంత అరుదైన క‌ణితి: విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేసి తీసిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు

Related image

క‌ర్నూలు, ఏప్రిల్ 03, 2023: క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు మండ‌లం పుట్టాయ‌ప‌ల్లి గ్రామానికి చెందిన 44 ఏళ్ల కె.జ‌య‌మ్మకు అత్యంత అరుదైన క‌ణితి  ఏర్ప‌డింది. అది మూత్ర‌కోశం వ‌ద్ద ఏర్ప‌డ‌టంతో మూత్ర‌విస‌ర్జ‌న‌కు ఇబ్బంది క‌లిగి తొలుత వేరే వైద్యుల వ‌ద్ద చూపించుకోగా, అక్క‌డినుంచి కిమ్స్ ఆస్ప‌త్రికి పంపారు. ఆస్ప‌త్రిలో ఆమెకు ప‌రీక్ష‌లు చేసి, శ‌స్త్రచికిత్స చేసిన క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ మ‌నోజ్‌కుమార్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

 
‘‘ఇన్‌ఫ్ల‌మేట‌రీ సూడోట్యూమ‌ర్ (ఐపీటీ) అనేది కేన్స‌ర్ కాని క‌ణితి. ఇది అత్యంత అరుదుగా సంభ‌విస్తుంది. సాధార‌ణంగా అయితే పొగ‌తాగేవారికి గానీ, ఏదైనా ర‌సాయ‌నాల‌కు గుర‌య్యేవారికి గానీ ఇది వ‌స్తుంది. కానీ ఈ కేసులో ఎలా వ‌చ్చింద‌న్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నాం. మూత్ర‌కోశం వ‌ద్ద విప‌రీత‌మైన నొప్పి వ‌స్తోంద‌ని జ‌య‌మ్మ మా వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఆమెకు లోప‌ల క‌ణితి ఉంద‌ని తెలిసి, ముందుగా చిన్న‌ముక్క తీసి బయాప్సీకి పంపాం. ఆ ప‌రీక్ష‌లో అది కేన్స‌ర్ కాద‌ని తెలిసింది. ఎందుకైనా మంచిద‌న్న ఉద్దేశంతో మ‌రోసారి వేరే ముక్క తీసి బ‌యాప్సీకి పంప‌గా, అప్పుడూ అదే ఫ‌లితం వ‌చ్చింది. దాంతో ఆ క‌ణితిని పూర్తిగా తొల‌గించి, అప్పుడు పరీక్షించాల‌ని నిర్ణ‌యించాం. అయితే, శ‌స్త్రచికిత్స చేసేలోపు ముందుగా ఆ క‌ణితి కింద‌కు జారి, మూత్ర‌నాళం వ‌ద్ద అడ్డుప‌డింది. దాంతో ఆమెకు మూత్రం రావ‌డం ఆగిపోయింది. వెంట‌నే మ‌ళ్లీ మా వ‌ద్ద‌కు రావ‌డంతో అత్య‌వ‌స‌రంగా శ‌స్త్రచికిత్స చేసి, దాదాపు ఐదు ఆరు సెంటీమీట‌ర్ల ప‌రిమాణంలో ఉన్న ఆ క‌ణితిని తొల‌గించాం. తొల‌గించిన క‌ణితిని ప‌రీక్ష‌కు పంప‌గా, అది అత్యంత అరుదైన ఇన్‌ఫ్ల‌మేట‌రీ సూడోట్యూమ‌ర్ (ఐపీటీ) అనే ర‌కం క‌ణితిగా తేలింది. వైద్య చ‌రిత్ర‌లోనే ఇలాంటివి రావ‌డం అత్యంత అరుదు. అలాంటి కేసు క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు నుంచి క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి రావ‌డంతో.. క‌ణితిని విజ‌య‌వంతంగా తొల‌గించి, ఆమెకు ఊర‌ట క‌ల్పించాం’’ అని డాక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ వివ‌రించారు.

More Press Releases