పర్యావరణ రక్షణలో కార్పోరేట్ కంపెనీలు, ఐ.టీ సంస్థలు భాగస్వామ్యం కావాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Related image

  • నీటి సంరక్షణ, మొక్కల పెంపకం ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి

  • తెలంగాణలో అన్ని పట్టణ ప్రాంతాల్లో లంగ్ స్పేస్ ల అభివృద్దికి ప్రణాళికలు వేస్తున్నాం 

  • బొటానికల్ గార్డెన్ లో డెలాయిట్ కంపెనీ ఇంపాక్ట్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణ రక్షణలో కార్పోరేట్ సంస్థలు, ఐ.టీ కంపెనీలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఐ.టీ కారిడార్ లో ఉన్న కొత్తగూడ బొటానికల్ గార్డెన్ లో ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్ నిర్వహించిన ఇంపాక్ట్ డే కార్యక్రమంలో మంత్రితో పాటు అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి జీవన విధానంలో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం భాగం కావాలన్నారు. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ ప్రయత్నాలకు కార్పోరేట్ సంస్థల సామాజిక బాధ్యత కూడా తోడైతే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గతంలో పూర్తిగా క్షీణించిన బొటానికల్ గార్డెన్, ప్రభుత్వ కృషితో ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలకు సమీపంలో అర్బన్ లంగ్ స్పేస్ లను (స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే ప్రాంతాలను) అభివృద్ది చేయాలన్న ధ్యేయంతో పని చేస్తున్నామన్నారు. గాలి కాలుష్యం వల్ల ఢిల్లీలో బతికే పరిస్థితి లేదని, స్కూళ్లకు పది రోజుల పాటు సెలవులు కూడా ఇచ్చారని, ఆ దుస్థితి మనకు రావొద్దన్నారు.

అటవీ అభివృద్ది సంస్థ పిలుపు మేరకు సుమారు ఐదు వందల మంది డెలాయిట్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బొటానికల్ గార్డెన్ లో క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ధన్వంతరి మూలికావనంలో ఔషధ మొక్కలు నాటారు. వర్షపు నీరు ఇంకి, భూగర్భ జలాలు పెరిగేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను తవ్వారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ నుంచి వచ్చిన సిబ్బంది వీరికి మొక్కలు నాటడంలో సాంకేతిక సహకారం అందించారు. నిత్యం బిజీగా ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వీలు ఉన్నప్పుడల్లా పర్యావరణహిత కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.

తాము నాటిన మొక్కలను కనీసం నెల రోజుల్లో ఒక్కసారైనా ఉద్యోగులు పర్యవేక్షించాలని, అవి చక్కగా ఎదిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 273 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొటానికల్ గార్డెన్ ఐటీ కారిడార్, గచ్చిబౌలి ప్రాంతాలకు తరగని ప్రకృతి వనరుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానికులతో పాటు కంపెనీలు, ఐటీ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావాలని అటవీ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. రఘువీర్ కోరారు. 

కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, ఎఫ్.డీ.సీ జనరల్ మేనేజర్, నాగభూషణం, ఓఎస్డీ, ఔషధ మొక్కల నిపుణులు డి. బసవ శంకర్, స్మరణ్ ఎన్జీవో ప్రతినిధి సుభాష్, కార్పోరేషన్ సిబ్బంది, వాకర్స్ అసోసియేష్ ప్రతినిధులు పాల్గొన్నారు.


More Press Releases