నిరుపేదలకు అండగా నిలుస్తున్న నిర్మలా హైస్కూల్ "దాతృత్వ మాసం"

Related image

పకీరు గూడెం అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం పంపిణీ
31వ తేదీన మరో మురికివాడలో 150 కుటుంబాలకు సహాయం అందచేత
చిన్నారులతో పాటు తల్లిదండ్రుల సహాకారం వల్లే సాధ్యం : సిస్టర్ జిబి అంటోని
 
            చిన్నారులలో సేవా భావాన్ని పెంపొందించే క్రమంలో విజయవాడ నిర్మలా హైస్కూల్ అమలు చేస్తున్న దాతృత్వ కార్యక్రమం నిరుపేదలకు అండగా నిలుస్తోంది. అత్యవసర వేళ అన్నార్తుల కడుపు నింపుతోంది. ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో నిర్మలా విద్యాసంస్ధ తమ విద్యార్ధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పాటిస్తుండగా, పిల్లలు తమదైన శైలిలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. "దాతృత్వ మాసం" ద్వారా సమకూరిన నగదు, బియ్యం, ఇతర వస్తువులను విద్యార్ధుల చేతుల మీదుగా నిరుపేదలకు అందేలా చేస్తూ నిర్మలా హైస్కూల్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.  ప్రతి ఏటా అక్టోబరు నెలంతా విద్యార్ధులు రోజూ చేతినిండా బియ్యం తీసుకుని ప్రత్యేకంగా పొదుపు చేస్తారు. అదే క్రమంలో తమ పాకెట్ మనీ మొత్తాలు, ఏ రూపంలో నైనా ఇతర సామాగ్రిని సైతం ఈ దాతృత్వం కోసం కేటాయిస్తారు.  ఇలా ఈ నెలలో సమకూరిన బియ్యం, ఇతర పొదుపు సామాగ్రిని విద్యార్ధులు అక్టోబర్ 26న పాఠశాలకు అందించగా వాటిని గురు, శుక్రవారాలలో నగర శివారు పకీరుగూడెంలో అగ్ని ప్రమాద బాధితులకు పంపిణీ చేసారు.

                పాఠశాల సిబ్బందితో కలిసి కొందరు విద్యార్థులు స్వయంగా ప్రమాద స్ధలానికి చేరుకుని 17 బాధిత కుటుంబాలకు ఈ సహాయం అందించారు. సర్వం కోల్పొయిన ఈ కుటుంబాలకు నిర్మలా విద్యార్థులు తమ వంతు సాయంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నూనె, పప్పు, గోధుమ పిండి తదితర సామాగ్రిని పంపిణీ చేసారు. మరోవైపు ఈ దాతృత్వ కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 31వ తేదీ సోమవారం తమ విద్యార్థులు మరో  150 కుటుంబాలకు సహాయం అందించనున్నారని నిర్మలా హైస్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జిబి అంటోని తెలిపారు. ఆటోనగర్ పరిసర ప్రాంతాలలోని మురికివాడను ఇందుకోసం ఎంపిక చేసుకున్నామన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం ఉదారంగా సహకరించటం వల్లే తాము ఈ కార్యక్రమం ద్వారా పేదలను ఆదుకోగలుగుతున్నామన్నారు. ప్రస్తుతం తమ చిన్నారులు సమకూర్చిన బియ్యం దాదాపు 2,500 కిలోలకు పైబడి ఉన్నాయని సిస్టర్ ఆంటోని వివరించారు. చిన్ననాటి నుండే దాతృత్వ గుణం అలవరిచేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నామన్నారు.

   

More Press Releases